Tirumala | శ్రీవారికి మైసూర్ రాజమాత అఖండ దీపం కుందెలు విరాళం

తిరుమల – కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి మైసూరు రాజమాత ప్రమోదా దేవి సోమవారం రెండు భారీ వెండి అఖండ దీపాలను కానుకగా సమర్పించారు. సుమారు మూడు శతాబ్దాల క్రితం అప్పటి మైసూరు మహారాజు శ్రీవారి ఆలయానికి ఇలాంటి అఖండ దీపాలను విరాళంగా అందించిన చారిత్రక నేపథ్యం ఉండటం విశేషం. ఇప్పుడు మళ్లీ అదే రాజవంశం నుంచి శ్రీవారికి ఈ అమూల్యమైన కానుక అందడం ప్రాధాన్యతం సంతరించుకుంది.

ఈ వెండి అఖండ దీపాలను శ్రీవారి ఆలయంలోని గర్భగుడిలో నిరంతరం వెలిగించేందుకు ఉపయోగిస్తారు. ఇవి ఆలయ సంప్రదాయంలో భాగమైన అత్యంత పవిత్రమైన దీపాలు. రాజమాత ప్రమోదా దేవి విరాళంగా ఇచ్చిన ప్రతి వెండి అఖండం సుమారు 50 కిలోల బరువు ఉంది. ఈ రెండు దీపాల తయారీలో దాదాపు 100 కిలోల వెండిని వినియోగించినట్లు తెలుస్తోంది. మైసూరు రాజవంశీకులు తరతరాలుగా శ్రీవారి భక్తులు కావడం, ఆలయానికి ఎన్నో కానుకలు సమర్పించడం తెలిసిందే.
తిరుమల ఆలయంలోని రంగనాయకుల మండపంలో జరిగిన ఒక కార్యక్రమంలో రాజమాత శ్రీ ప్రమోదా దేవి ఈ వెండి అఖండాలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి టీటీడీ ఛైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడు, అదనపు కార్యనిర్వహణాధికారి (ఈవో) శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి హాజరయ్యారు. వారి సమక్షంలో మైసూరు రాజమాత ఈ కానుకను శ్రీవారికి సమర్పించారు.
