హన్మకొండలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
హన్మకొండ (ఆంధ్రప్రభ బ్యూరో): భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను హన్మకొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో శనివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తోందని తెలిపారు. హన్మకొండ జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని వివరించారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన పౌర సేవలు అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ సమగ్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
స్వాతంత్ర్య సమరయోధులకు ఘన సన్మానం
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఇతర ప్రజాప్రతినిధులు స్వాతంత్ర్య సమరయోధులను, వారి కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. దేశ స్వాతంత్ర్యం కోసం వారు చేసిన త్యాగాలు, సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. సమరయోధుల త్యాగాల స్ఫూర్తితో ప్రజా సంక్షేమం, దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.
అభివృద్ధి కార్యక్రమాల శకటాలు ప్రత్యేక ఆకర్షణ
వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శకటాలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రదర్శనలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వ్యవసాయ, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య, మత్స్య, గృహ నిర్మాణ, విద్య, జీడబ్ల్యూఎంసీ, రెవెన్యూ, పశుసంవర్ధక శాఖలు తమ శాఖల ద్వారా అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను శకటాలు, ప్రదర్శనల ద్వారా ప్రజలకు వివరించాయి. ఆయా శాఖల ప్రగతి, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను ప్రదర్శనల రూపంలో చూపించారు.
ఆకట్టుకున్న విద్యార్థుల దేశభక్తి కార్యక్రమాలు
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన దేశభక్తి, సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకలకు మరింత శోభను తీసుకొచ్చాయి. విద్యార్థుల ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దేశభక్తిని ప్రతిబింబించే గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు అలరించారు.
కార్యక్రమంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత, హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, నగర ప్రముఖులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
