మహిళలకు అండగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌

పేదింటి ఆడపడుచులకు ఆర్థిక భరోసా : ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు

సుబేదారి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచిన నాయకుడు సీఎం రేవంత్‌రెడ్డి అని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్‌ అధికారి కేఆర్‌ నాగరాజు అన్నారు.

మంగళవారం ఐనవోలు మండలానికి చెందిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల లబ్ధిదారులైన 47 మంది ఆడపడుచులకు రూ.47 లక్షల 5 వేల 452 విలువైన చెక్కులను సుబేదారిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీ పేదింటి ఆడపడుచులకు వరమన్నారు. ఆడపిల్లల పెళ్లిళ్ల సమయంలో కుటుంబాలపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను అమలు చేస్తోందన్నారు.

అర్హులైన ప్రతి కుటుంబం ఈ పథకాల ప్రయోజనాలను పొందాలని సూచించారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, సంక్షేమ పథకాలను ప్రజల ఇంటి వద్దకే తీసుకెళ్లేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మోహన్‌గౌడ్‌, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు శంకర్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు బుచ్చిరెడ్డి, జేబీఎం జిల్లా చైర్మన్‌ రుగ్వేద్‌రెడ్డి, జిల్లా సెక్రటరీ సాంబయ్య, మహేష్‌గౌడ్‌, ఎలీషా, సీనియర్‌ నాయకులు మధు, రాకేష్‌రెడ్డి, రాజు, లక్ష్మణ్‌రావు, సర్పంచులు, వార్డు సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.