హైదరాబాద్ : రాబోయే జనాభా లెక్కలతో పాటే కులగణన నిర్వహించేందుకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనతో ‘క్యాస్ట్ సెన్సస్ పాలిటిక్స్’ హీటెక్కుతున్నాయి. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించి తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపి దానిని రాష్ట్రపతికి పంపడంపై తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు ఇవాళ గవర్నర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. రాజ్ భవన్ కు వెళ్లిన కాంగ్రెస్ నేతలు గవర్నర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.
ఈసందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్.. దేశవ్యాప్తంగా కులగణన జరపాలని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని బలహీన వర్గాలకు చెందిన వారందరం స్వాగతిస్తున్నామని చెప్పారు. కులగణన తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందని, కులగణనను గతంలో విమర్శించిన వారే ఇప్పుడు ఆదర్శంగా తీసుకున్నారన్నారు. రాహుల్ గాంధీ పోరాట ఫలితమే కేంద్ర కేబినెట్ నిర్ణయమని రాహుల్ గాంధీ నినాదం ఇప్పుడు ఆచరణలోకి వచ్చిందన్నారు. రేవంత్ పాలనలో కులగణన జరగడంతో కేంద్రం దిగి వచ్చిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణనను కేంద్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుంటే బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని అలాంటి వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.