Pawan Kalyan | కుంకీ ఏనుగులతో కొత్త కార్యాచరణ..!

  • గుచ్చిమితో ఏనుగుల నియంత్రణ
  • ఉత్తరాంధ్రలో కొత్త అధ్యాయం
  • ప్రజల భద్రతే ప్రభుత్వ లక్ష్యం
  • ప్రకృతి–ప్రజల మధ్య సమతుల్యత
  • కర్ణాటకకు పవన్ కృతజ్ఞతలు

అమరావతి, ఆంధ్రప్రభ: “ప్రకృతి మనకు చెందినది కాదు… మనమే ప్రకృతికి చెందినవాళ్లం. అందుకే ప్రకృతితో సామరస్యంగా జీవించాలి. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యత ఉన్నప్పుడే స్థిరమైన ప్రగతి సాధ్యమవుతుంది. ప్రజల భద్రతతోపాటు వన్యప్రాణుల సంరక్షణపైనా ప్రభుత్వానికి బాధ్యత ఉంది. అదే దృక్పథంతో మానవ–ఏనుగు సంఘర్షణలను తగ్గించడానికి గుచ్చిమి ఎలిఫెంట్ క్యాంప్‌ను ఏర్పాటు చేశాం” అని ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.

పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం గుచ్చిమిలో ఏర్పాటు చేసిన కుంకీ ఏనుగుల శిబిరాన్ని పవన్ కళ్యాణ్ బుధవారం ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. అడవి ఏనుగుల సంచారాన్ని సమర్థవంతంగా నియంత్రించడం, ప్రజల ప్రాణాలు, రైతుల పంటలను రక్షించడం, దశాబ్దాలుగా కొనసాగుతున్న మానవ–ఏనుగు సంఘర్షణను నివారించడమే ఈ శిబిరం ప్రధాన లక్ష్యమని తెలిపారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు గ్రామాల్లోకి ప్రవేశించడం, రైతుల పంటలను ధ్వంసం చేయడం, ప్రజలు రాత్రివేళ భయాందోళనల మధ్య జీవించడం వంటి సమస్యలు పార్వతీపురం మన్యం జిల్లాలో చాలా కాలంగా కొనసాగుతున్నాయి. ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నప్పుడు పాలకొండ శాసనసభ్యుడు నిమ్మక జయకృష్ణ, స్థానిక ప్రజలు ఈ సమస్యను నా దృష్టికి తీసుకొచ్చారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపడం ప్రభుత్వ బాధ్యతగా భావించి గుచ్చిమి ఎలిఫెంట్ హోల్డింగ్ ఏరియాను ఏర్పాటు చేశాం. ఉత్తరాంధ్రలో మానవ–ఏనుగు సంఘర్షణల నివారణలో ఈ కేంద్రం కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది” అని పేర్కొన్నారు.

అదే విజయం రిపీట్ కావాలి..

గతంలో పలమనేరు ప్రాంతంలో చేపట్టిన క్లిష్టమైన ఆపరేషన్లలో కుంకీ ఏనుగులు జయంత్, అభిమన్యుతో పాటు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో సమర్థంగా పని చేశారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఆధునిక సాంకేతికత వినియోగంతో మానవ–ఏనుగు సంఘర్షణల కారణంగా సంభవించే మరణాలను 70 శాతానికి పైగా తగ్గించడంతో పాటు పంట నష్టాలను కూడా గణనీయంగా తగ్గించగలిగామని తెలిపారు.

అదే విజయాన్ని ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా సాధించాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు. మనుషులు, ఏనుగుల మధ్య సామరస్య సహజీవనానికి వేదికగా ఈ గుచ్చిమి ఏనుగుల క్యాంప్ నిలవాలని ఆకాంక్షిస్తూ, దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.

కర్ణాటక ప్రజలు, ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు..

“పార్వతీపురం జిల్లాలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామంటే దానికి ప్రధాన కారణం కర్ణాటక ప్రభుత్వం, అక్కడి ప్రజలు అందించిన సహకారం. మన విజ్ఞప్తిని గౌరవించి ఎంతో ఆప్యాయతతో నాలుగు కుంకీ ఏనుగులను మన రాష్ట్రానికి పంపించడం వారి గొప్ప మనసుకు, స్నేహభావానికి నిదర్శనం. ఏనుగులను ఇవ్వడం అనేది సంపద ఇచ్చినట్లుగా అక్కడి ప్రజలు భావిస్తారు. అయినా తెలుగు ప్రజల రక్షణ కోసం ప్రేమతో కుంకీ ఏనుగులను మన రాష్ట్రానికి పంపించిన కర్ణాటక ప్రభుత్వం, ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం” అని పవన్ కళ్యాణ్ అన్నారు.

ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, అప్పటి అటవీశాఖ మంత్రి, ప్రస్తుత పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రేలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వారి సహకారం, స్నేహభావం రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేశాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పార్వతీపురం శాసనసభ్యుడుబోనెల విజయ్ చంద్ర, పాలకొండ శాసనసభ్యుడు నిమ్మక జయకృష్ణ, శాసనసభ విప్ తోయక జగదీశ్వరి, అటవీ, పర్యావరణ శాఖల ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, పీసీసీఎఫ్ పి.వి. చలపతిరావు, అటవీశాఖ సలహాదారు మల్లికార్జునరావు, సీసీఎఫ్ (వైల్డ్‌లైఫ్)ఎన్. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ నందిని సలారియా, విశాఖపట్నం చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఐ.కె.వి. రాజు, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి, జిల్లా అటవీ అధికారి ప్రసూన తదితరులు పాల్గొన్నారు.