చైనా స్టార్‌కు షాకిచ్చిన‌ సింధు..

  • జపాన్ ఓపెన్ క్వార్టర్‌ఫైనల్‌కు సింధు..
  • కేవలం 35 నిమిషాల్లోనే వరుస గేమ్‌లలో విజయం

ఆంధ్రప్రభ : భారత స్టార్ షట్లర్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు జపాన్ ఓపెన్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రీక్వార్టర్‌ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ హాన్ యూ (చైనా)పై సింధు నేరుగా రెండు గేమ్‌ల్లో విజయం సాధించింది. ప్రపంచ 10వ ర్యాంకర్ సింధు.. కేవలం 35 నిమిషాల్లో 21-16, 21-14 స్కోరుతో హాన్ యూను చిత్తు చేసి క్వార్టర్‌ఫైనల్‌కు అడుగుపెట్టింది.

రెండో గేమ్‌లో ఏకపక్ష ఆధిపత్యం..

మొదటి గేమ్‌లో ఆరంభంలో కాస్త నెమ్మదిగా కనిపించిన సింధు.. మధ్యలో రిథ‌మ్ అందుకుని వరుస పాయింట్లు సాధిస్తూ గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో అయితే ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 8-0 ఆధిక్యం సాధించి పూర్తిగా మ్యాచ్‌పై పట్టు సాధించింది. చివరికి వరుస గేమ్‌ల్లో విజయం ఖాయం చేసింది.

మొదటి గేమ్‌ ఆరంభంలో సింధు కాస్త నెమ్మదిగా కనిపించినప్పటికీ, మధ్యలో తన లయను అందుకుని వరుసగా పాయింట్లు సాధించి ఆ గేమ్‌ను గెలుచుకుంది. రెండో గేమ్‌లో ఆమె పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది; ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 8-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లి, చివరికి వరుస గేమ్లలో విజయం సాధించింది.

క్వార్టర్‌లో ఒకుహరాతో పోరు

క్వార్టర్‌ఫైనల్లో సింధు.. జపాన్ మాజీ ప్రపంచ ఛాంపియన్ నొజోమి ఒకుహరాతో తలపడనుంది. దక్షిణ కొరియా అగ్రశ్రేణి క్రీడాకారిణి అన్ సె-యంగ్ టోర్నీ నుంచి తప్పుకోవడంతో ఒకుహరాకు రెండో రౌండ్‌లో వాక్‌ఓవర్ లభించింది.

ఇక భారత మిక్స్‌డ్ డబుల్స్ జోడీ తనీషా క్రాస్టో–ధృవ్ కపిలా ప్రీక్వార్టర్‌ఫైనల్లో చైనా అగ్రశ్రేణి జోడీ ఫెంగ్ యాన్ జె–హువాంగ్ డాంగ్ పింగ్ చేతిలో 20-22, 17-21 తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో జపాన్ ఓపెన్‌లో భారత్ తరఫున సింధు మాత్రమే మిగిలింది.