అపరిశుభ్రతపై ఉడిపి హోటల్‌కు రూ.5 వేల జరిమానా

అచ్చంపేట (ఆంధ్రప్రభ): అచ్చంపేట పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న నందికేశ్వర ఉడిపి హోటల్‌లో మున్సిపల్ అధికారులు సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో హోటల్‌లో అపరిశుభ్ర వాతావరణం నెలకొని ఉండటంతో పాటు ఫ్రిజ్‌లో నూడుల్స్, అన్నం, పలు రకాల చట్నీలను నిల్వ ఉంచినట్లు గుర్తించారు. అంతేకాకుండా పాడైపోయిన అన్నాన్ని కూడా పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు.

తనిఖీల సందర్భంగా నిషేధిత ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తున్నట్లు గుర్తించిన అధికారులు హోటల్ నిర్వాహకుడు మిథున్‌కు రూ.5 వేల జరిమానా విధించారు. ఆహార పదార్థాలను పరిశుభ్రంగా నిల్వ ఉంచాలని, ఆహార భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని హోటల్ యాజమాన్యానికి సూచించారు.

ఈ తనిఖీల్లో శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ గణేష్‌తో పాటు మున్సిపల్ సిబ్బంది నిజాం, జవాన్లు తిరుపతయ్య, ప్రవీణ్, దామోదర్ పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇటువంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు తెలిపారు.