ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : భూపాలపల్లి మండలంలోని నాగారం, ఆజంనగర్, నందిగామ, దీక్షకుంట, పంబాపూర్, గొల్లబుద్దారం, న్యూ లంబాడి తండా, కమలాపూర్ అటవీ గ్రామాల్లో గురువారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సుడిగాలి పర్యటన చేశారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు.
రైతులు మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే వరి ధాన్యాన్ని తీసుకురావాలన్నారు. దళారులను నమ్మి మోసపోకుండా జాగ్రత్తపడాలని రైతులకు సూచించారు. ధాన్యం తీసుకురాబోతున్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే అక్కడున్న వివిధ శాఖల అధికారులకు ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగేలా అధికారులు ప్రతిరోజూ పర్యవేక్షణ చేయాలని తెలిపారు. వివిధ గ్రామాల్లో గన్నీ సంచుల కొరత ఉందని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, సాయంత్రం కల్లా సమస్యను పరిష్కరించాలని సివిల్ సప్లై డీఎంను ఆదేశించారు.