Nalgonda | భూభారతి చట్టంతో భూసమస్యలకు చెక్‌ – మంత్రి పొంగులేటి

ఆధార్‌లా భూదార్ కార్డు
త్వరలో 6000 మంది లైసెన్సుడు సర్వేయర్ల నియామకం
భూభారతి తో 9.26 లక్షల సాదాభైనామ దరఖాస్తులకు మోక్షం
వచ్చేనెల మొదటి వారంలోగా 10,956 మంది వీఆర్ఓల‌ నియామకం
పైలెట్ మండలంగా చందంపేట ఎంపిక చేస్తాం
రెవెన్యూ, స‌మాచార శాఖ‌ మంత్రి పొంగులేటి సుధాకర్ రెడ్డి

నల్లగొండ , ఆంధ్రప్రభ ప్రతినిధి : భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం అన్నివర్గాల వారితో చర్చించి భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిందని రాష్ట్ర రెవెన్యూ , స‌మాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. సోమ‌వారం చందంపేటలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ధరణి పోర్టల్ వల్ల రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను గమనించి తాము అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ ను ఎత్తివేస్తామని చెప్పామని గుర్తు చేశారు. భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి చట్టాన్ని అమలులోకి తెచ్చామని చెప్పారు. చందంపేట మండలాన్ని స్థానిక ఎమ్మెల్యే బాలు నాయక్ కోరిక మేరకు పైలట్ మండలంగా ఎంపిక చేసి మండలంలో నెలకొని ఉన్న డీఫారెస్ట్, అసైన్డ్ ల్యాండ్ తదితర వివాదాల భూములను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఆధార్ కార్డు లాగే భూధార్ కార్డు
ఆధార్ కార్డు తరహాలోనే రైతులకు తమ భూములకు సంబంధించి త్వరలో భూధార్ కార్డును అందజేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. భూ సమస్యల పరిష్కారం కోసం త్వరలో 6000 మంది లైసెన్స్ డ్ సర్వేయర్లను నియమించున్నామని, గ్రామీణ ప్రాంతాల ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకొని 10 956 మంది గ్రామ రెవిన్యూ అధికారులను నియమించనున్నామని ప్రకటించారు. భూ భారతి చట్టం ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారి భూములను క్రమబద్ధీకరిస్తామని శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. భూమి ఒక సర్వేనెంబర్ లో ఉంటే మరో సర్వేనెంబర్ నమోదు చేయడం, సాగులో ఒకరు ఉంటే రికార్డులో మరో పేరు ఉండడం, ఒక సర్వే నెంబర్ లో చిన్న వివాదం ఉంటే ఆ సర్వేనెంబర్ మొత్తాన్ని నిషిద్ధ సర్వేనెంబర్ జాబితాలో చేర్చడం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. భూ భారతి ఇన్నాళ్లు రైతులు పడ్డ సమస్యలకు పరిష్కారం లభించనుందని చెప్పారు.

రైతుల వద్దకే రెవిన్యూ అధికారులు
భూభారతి చట్టం ద్వారా రైతులు త‌సిల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఇకమీదట రెవెన్యూ అధికారులే గ్రామాలలోకి వచ్చి రైతుల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరిస్తారని ఆయన తెలిపారు. అర్హులుంటే పింకు చొక్కాల కు కూడా సంక్షేమ ఫలాలు అందించాలని సూచించారు. గత ప్రభుత్వంలో తమ పార్టీ కార్యకర్తలకు మాత్రమే సంక్షేమ పథకాలు అందించాలని అలాంటి నీచమైన పనికి తాము పూనుకోమని చెప్పారు. ఇందిరమ్మ రాజ్య స్థాపనే తమ లక్ష్యం అని అందుకోసం ఎన్నో ప్రయాసలకు ఓర్చి అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. దేవరకొండ నియోజకవర్గానికి సీఎం 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశార‌ని గిరిజన అధికంగా ఉన్న ఈ నియోజకవర్గానికి ఎక్కువ సంఖ్యలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేలా చూడాలని ఎమ్మెల్యే బాలు నాయక్ మంత్రిని కోరడంతో స్పందించిన ఆయన సీఎం రేవంత్ రెడ్డి తో మాట్లాడి మరిన్ని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కేతావత్ శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్, అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ జమున మాధవరెడ్డి, ఆర్డీవో రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *