కాశీబుగ్గలో కల్తీ పచ్చడి గుట్టురట్టు..

  • 2.25 లక్షల విలువైన నిల్వలు స్వాధీనం

ఉమ్మడి వరంగల్, ఆంధ్రప్రభ ప్రతినిధి : వరంగల్ నగరంలోని కాశీబుగ్గ ప్రాంతంలో అత్యంత అపరిశుభ్ర పరిస్థితుల్లో అక్రమంగా పచ్చడి తయారీ, నిల్వలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి భారీ మొత్తంలో కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇంతేజార్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కాశీబుగ్గ సాయి వీధిలో ఉన్న ఓ నివాస గృహంలో నిర్వహించిన తనిఖీల్లో పెద్ద ఎత్తున కుళ్లిపోయిన పచ్చడి ముడిసరుకులు, ఆహార పదార్థాలు నిల్వ ఉంచినట్లు గుర్తించారు. వాటిని చిన్న ప్యాకెట్లలో ప్యాకింగ్ చేసి స్థానిక కిరాణా దుకాణాలు, ఇతర వ్యాపార కేంద్రాలకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది.

ఈ వ్యవహారంలో కాశీబుగ్గకు చెందిన అరికెల శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. దాడిలో 750 కిలోల టమోటా, 900 కిలోల మామిడి, 200 కిలోల నిమ్మకాయలు, 100 కిలోల ఉసిరికాయలు, 150 కిలోల అల్లం-వెల్లుల్లి పేస్ట్‌తో కూడిన మొత్తం రూ.2.25 లక్షల విలువైన కుళ్లిపోయిన, కల్తీ ఆహార నిల్వలను స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడిన నిందితుడిని, స్వాధీనం చేసుకున్న సరుకును తదుపరి చట్టపరమైన చర్యల కోసం ఇంతేజార్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌కు అప్పగించినట్లు అధికారులు తెలిపారు.

ప్రజలు బ్రాండ్ లేని లేదా అనుమానాస్పద ఆహార పదార్థాలు, పచ్చళ్లను కొనుగోలు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని టాస్క్‌ఫోర్స్ అధికారులు సూచించారు. ఇలాంటి అక్రమ నిల్వ కేంద్రాలు లేదా కల్తీ ఆహార పదార్థాల విక్రయాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.

టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ బండారి రాజు, ఆర్‌ఎస్‌ఐ భాను ప్రకాష్‌తో పాటు టాస్క్‌ఫోర్స్ సిబ్బంది ఈ దాడులు నిర్వహించారు.