పేదింటి కలను సాకారం చేసిన సీఎం రేవంత్

పేదింటి కలను సాకారం చేసిన సీఎం రేవంత్
- ఎమ్మెల్యే కడియం శ్రీహరి
చిలుపూర్, ఆంధ్రప్రభ : ప్రజా ప్రభుత్వంలోనే నిరుపేద ప్రజల సొంత ఇంటి కల వాస్తవ రూపం దాలుస్తున్నదని స్టేషన్ ఘన్ పూర్ ఎంఎల్ఎ, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. చిలుపూర్ మండలం శ్రీపతిపల్లి లో రంగు రమేష్ కు ఇందిరమ్మ ఇల్లు నిర్మించగా శనివారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్బంగా లబ్ధిదారు కుటుంబ సభ్యులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించి అనంతరం ఇంటి నిర్మాణాన్ని పరిశీలించారు.
అనంతరం ఎమ్మెల్యే శ్రీహరి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వంలోనే నిరుపేద ప్రజల సొంత ఇంటి కల వాస్తవ రూపం దాలుస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.22వేల 500కోట్లతో 4లక్షల 50వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. అందులో భాగంగానే స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి మొదటి విడతలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయని, కొన్ని నిర్మాణాలు పూర్తి చేసుకొని గృహప్రవేశం జరుగుతుండగా మరికొన్ని వివిధ నిర్మాణ దశల్లో ఉన్నట్లు తెలిపారు. 85శాతం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించి ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం మొదటి స్థానంలో ఉన్నట్లు తెలిపారు.
నిరుపేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించే విధంగా ప్రభుత్వం అందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నదని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి మరొక 3,500 ఇందిరమ్మ ఇల్లు రాబోతున్నాయని తెలిపారు. ఈసారి ప్రభుత్వం లబ్ధిదారులకు కొన్ని వెసులుబాటులు కల్పించిందని అందులో అనుమతులు రాకముందే బేస్మెట్ కట్టుకున్న వాళ్లకు, గతంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయి బేస్మెట్ వరకే నిర్మాణం చేసుకున్న వారికీ సైతం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయనున్నట్లు అందుకు సంబందించిన జీవో 96ను కూడా నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని వెల్లడించారు.
గతంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయి బేస్మెట్ లెవల్ కట్టుకున్న వారికి రూ.4లక్షలు, రూఫ్ లెవల్ నిర్మాణం అయిన ఇంటికి రూ.3లక్షల ఆర్థిక సహాయం అందించే విధంగా వెసులుబాటు కల్పించిందని తెలిపారు. రానున్న మూడేళ్లలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిలుపూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, బొమ్మిశెట్టి బాలరాజు, ఎండి. షకిల్, మారబోయిన ఎల్లయ్య, నరేష్, రవిందర్ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
