90Percent | పాలమూరు-రంగారెడ్డిని నిర్లక్ష్యం చేసిన బీఆర్ఎస్

90Percent | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కోసం అవసరమైన నిధులను ఎలాంటి జాప్యం లేకుండా కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి తెలిపారు. హైదరాబాద్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో సీఎం సమావేశమైన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్ పార్టీ పాలమూరు – రంగారెడ్డిని బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసింది.. పొర్లు దండాలు పెట్టినా.. బీఆర్ఎస్ ను నమ్మరని అన్నారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును 90శాతం పూర్తి చేశామని బీఆర్ఎస్ నేతలు చెప్పడం దారుణమని మంత్రులు విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని వాకిటి శ్రీహరి హితవు పలికారు. పాలమూరు పోరుయాత్ర పేరుతో బీఆర్ఎస్ పాదయాత్ర చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు.
రూ.లక్ష కోట్ల అంచనా వ్యయంతో ఉన్న ప్రాజెక్టుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం రూ.25 వేల కోట్లే ఖర్చు చేసిందని జూపల్లి ఆరోపించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పగిస్తే భారీ అప్పులు మిగిల్చారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు నీళ్లు అందించడమే లక్ష్యంగా పనిచేస్తోందని స్పష్టం చేశారు.
