3000 Titco houses | అవి.. ఉయ్యూరు పేద ప్రజలకు అందచేయండి..

3000 Titco houses | అవి.. ఉయ్యూరు పేద ప్రజలకు అందచేయండి..
3000 Titco houses | ఉయ్యురు, ఆంధ్రప్రభ : ఉయ్యూరు నగర పంచాయతీ ఏరియాలో నిర్మించినటువంటి టిడ్కో ఇళ్ల పనులను త్వరగా పూర్తి చేసి పేద లబ్ధిదారులకు ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుని అమరావతి సెక్రటేరియట్ లో కలిసి మాజీ ఎంఎల్సీ వై.వి.బి.రాజేంద్రప్రసాద్ వినతి పత్రం ఇచ్చారు. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించి” తప్పకుండా మొదటి విడతలో మీ ఉయ్యూరు నగర పంచాయతీ ఏరియాలో నిర్మించినటువంటి టిడ్కో ఇళ్ల పనులు శరవేగంగా పూర్తి చేస్తామని, వీలైనంత తొందరలో లబ్ధిదారులకు ఆ ఇళ్లను అందిస్తామని రాజేంద్రప్రసాద్ కి హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ఉయ్యూరులో గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 90 శాతం పూర్తయిన సుమారు 3000 వేల టిట్కో ఇళ్లను జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు వల్ల వాటిని పాడు పెట్టడం జరిగిందన్నారు. టిడ్కో ఇళ్లకు డబ్బులు కట్టిన పేద లబ్ధిదారులు ఈ ఇళ్ల సమస్యను నా దృష్టికి తీసుకురావడం జరిగిందని, అద్దె ఇళ్లల్లో ఉంటూ అద్దెలు కట్టలేక, టిడ్కో ఇళ్ల కోసం చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నామని, అలాగే టిడ్కో ఇళ్ల పైన మా పేరు మీద గత వైసిపి ప్రభుత్వం బ్యాంకుల్లో తీసుకున్న అప్పులకు ఇన్స్టాల్మెంట్ కట్టమని బ్యాంకుల వాళ్లు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేద ప్రజలు తెలియపరిచారని రాజేంద్రప్రసాద్ అన్నారు. ఇదే ఉయ్యూరు పేద ప్రజల సమస్యలను,విషయాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకు వెళ్లి వివరించానని, దానిమీదట ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పందించి “టిట్కో ఇల్లు పూర్తి చేసే విధానంపై ప్రత్యేక దృష్టి పెట్టామని త్వరలోనే వాటిని పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని ” ముఖ్యమంత్రి స్పష్టమైన హామీ ఇచ్చారని రాజేంద్రప్రసాద్ తెలియజేసారు.
