11thJune2026 | తిరుమలలో రద్దీ
11thJune2026 | తిరుమలలో రద్దీ
- శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు
11thJune2026 | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం తిరుమల క్షేత్రానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. వేసవి సెలవులు, శుభముహూర్తాలు, వారాంత ప్రభావంతో తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు భక్తులతో నిండిపోగా, సర్వదర్శనం కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
తిరుమలలో గురువారం భక్తుల రద్దీ అధికంగా కొనసాగింది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం కోసం సుమారు 18 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ కారణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి.
గత 24 గంటల్లో మొత్తం 86,124 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు. అదే సమయంలో 41,520 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక శ్రీవారి హుండీకి భక్తులు భారీగా కానుకలు సమర్పించారు. ఒక్కరోజులోనే హుండీ ద్వారా రూ.3.51 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ వెల్లడించింది.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లను మరింత పటిష్టం చేశారు. భక్తులకు తాగునీరు, అన్నప్రసాదం, వైద్య సేవలు అందుబాటులో ఉంచడంతో పాటు క్యూలైన్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో తిరుమలకు రావాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు.
