ఘనంగా హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన..

ఘనంగా హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన..

రెండు రోజుల పాటు నిర్వహించనున్న పూజలు
మొదటి రోజు సామూహిక హోమంతో నెలకొన్న భక్తి వాతావరణం

భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ : భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డ్ పెద్దకుంటపల్లి గ్రామంలో హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మాజీ కౌన్సిలర్ రజిత జుమ్ములాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక హోమం కార్యక్రమం భక్తి శ్రద్ధలతో సాగింది. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని హోమంలో ఆహుతులు సమర్పించారు.

పూజలు రెండు రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మొదటి రోజు కుంకుమ పూజలతో పాటు ప్రతిష్ఠించబోయే విగ్రహాలను గ్రామంలో ఊరేగింపుగా తీసుకెళ్లడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళలు, యువత, వృద్ధులు పాల్గొని భక్తి గీతాలతో కార్యక్రమాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చారు. ఈ సందర్భంగా విగ్రహ దాతలు బానోత్ మోహన శ్రీ, మోతిలాల్‌లకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.