AP | గెలుపే లక్ష్యంగా పని చేయండి.. కూటమి నేతలతో చంద్రబాబు
- ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెలి కాన్ఫరెన్స్
- రెండు స్థానాలు గెలవాల్సిందేనంటూ దిశనిర్దేశం
వెలగపూడి – ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్, రాజశేఖర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎన్డీఏ పక్షాలతో సమన్వయ సమావేశాలు పెట్టుకుని పనిచేయాలని సూచించారు. ఏ ఎన్నిక వచ్చినా గెలిచినప్పుడే సుస్థిర పాలన ఉంటుందన్నారు. రాత్రికి రాత్రే అన్నీ జరిగిపోతాయని మనం చెప్పట్లేదని పేర్కొన్నారు. గాడి తప్పిన వ్యవస్థలను సరిదిద్దుతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎన్డీఏ కూటమి భాగస్వామ్య నేతలకు చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ ద్వారా నేడు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఫిభ్రవరి 3న నోటిఫికేషన్ వస్తుందని.. 27న ఎన్నికలు, కౌంటింగ్ మార్చి 3న జరుగుతాయని తెలిపారు. ప్రతి గ్యాడ్యుయేట్ను కలిసి భారీ మెజారిటీ సాధించాలని… చదువుకున్న వాళ్లంతా కూటమితోనే ఉన్నారని చెప్పారు. ఎవరూ ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉండొద్దని నేతలకు సూచించారు. ఎన్డీయే పక్షాలతో సమన్వయ సమావేశాలు పెట్టుకుని పనిచేయాలని వెల్లడించారు. క్లస్టర్, యూనిట్, బూత్, ఇంచార్జ్లతో పాటు, జనసేన, బీజేపీ కమిటీల నేతలతో ముందుకెళ్లాలని నిర్దేశించారు. ఈ ఎన్నికలు ఏకపక్షంగా జరగాలని… ఏ ఎన్నిక వచ్చినా గెలిచినప్పుడే సుస్థిర పాలన ఉంటుందని.. ప్రజల్లో మరింత ఆదరణ పెరుగుతుందని చెప్పారు. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నేతలు మరింత చిత్తశుద్ధితో పని చేయాలని తెలిపారు.
కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన 7 నెలల్లో ఇబ్బందులు అధిగమించి సుపరిపాలన వైపు అడుగులు వేస్తున్నామని.. ప్రజలకు ఇబ్బంది లేని పాలన సాగిస్తున్నామని పేర్కొన్నారు. రాత్రికి రాత్రి అన్నీ జరిగిపోతాయని మనం చెప్పడం లేదని, గాడి తప్పిన వ్యవస్థలను సరిదిద్దుతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో విశాఖ స్టీల్ ప్లాంట్, రాజధాని అమరావతికి ఆర్ధిక సాయం, పోలవరానికి నిధులు, రైల్వే జోన్తో పాటు ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. జాబ్ ఫస్ట్ విధానంతో నూతన ఇండస్ట్రియల్ పాలసీలు తీసుకొచ్చామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దాదాపు రూ.7లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చామని.. ఈ పెట్టుబడుల ద్వారా 4,10,125 ఉద్యోగాలు యువతకు వస్తాయన్నారు. త్వరలోనే 16,347 టీచర్ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తున్నామన్నారు.
ఇవన్నీ ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉందన్నారు. మూడు పార్టీల నేతలు సార్వత్రిక ఎన్నికలకు ముందు సమన్వయంతో పని చేసినట్లుగానే ఇప్పుడూ అదేవిధంగా పని చేయాలని సూచనలు చేశారు. జరిగే ప్రతి ఎన్నికల్లో గెలిచేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు. కూటమికి యూటీఎఫ్ మినహా మిగతా ఉపాధ్యాయ సంఘాల మద్ధతు ఉందని సీఎం వెల్లడించారు.