Delhi | దేశాభివృద్ధి ఫలాలు అందరికీ అందిస్తాం – రాష్ట్రపతి
ఢిల్లీ: దేశాభివృద్ధి ఫలాలు అందరికీ అందించడమే లక్ష్యమన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. వన్ నేషన్.. వన్ ఎలక్షన్కు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని పేర్కొన్నారు.. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలిరోజైన నేడు ఉభయసభలను ఉద్దేశిస్తూ పార్లమెంట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ముందుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు పార్లమెంట్ ఉభయ సభలు నివాళులర్పించాయి. ప్రధానిగా ఆయన చేసిన సేవలను పార్లమెంట్ సాక్షిగా కొనియాడారు. మరోవైపు మహా కుంభమేళా తొక్కిసలాట ఘటనలో మృతులకు సైతం ఉభయ సభల సభ్యులు నివాళులు అర్పించారు.
అనంతరం రాష్ర్టపతి ప్రసంగిస్తూ… ప్రయాగ్ రాజ్లోని మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి విచారం వ్యక్తం చేస్తూ.. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఇక ప్రపంచంలోనే భారత్ను మూడో ఆర్థిక శక్తిగా నిలిపేందుకు ముందుకు వెళుతున్నామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా మధ్యతరగతివారే.. వాళ్ల కోసం 8వ పేకమిషన్ను ఏర్పాటు చేశామన్నారు. మహిళలను లక్పతి దీదీలుగా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. డ్రోన్ దీదీ స్కీమ్ మహిళలకు ఉపయోగపడుతోందని తెలిపారు.. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రారంభించామని, భారత్ను గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్హౌస్గా మారుస్తామని వెల్లడించారు.. ఇండియా ఏఐ మిషన్ను ప్రారంభించామని, సైబర్ క్రైమ్లను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తన ప్రసంగంలో ప్రస్తావించారు..
“బడ్జెట్-2025లో రైతులు, మహిళలు, పేదలు, యువతకు ప్రాధాన్యం ఇస్తున్నాం. మా ప్రభుత్వం మూడో టెర్మ్లో మూడు రెట్ల వేగంతో అభివృద్ధి దూసుకెళ్తోంది. అందుకే వేగంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నాం. 3 కోట్ల మంది పేద కుటుంబాలకు ఇళ్లు నిర్మిస్తున్నాం. పేద, మధ్యతరగతి ప్రజలకు హోమ్ లోన్ సబ్సిడీ ఇస్తున్నాం. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చాం. రూ.70 వేల కోట్లతో గ్రామీణ రహదారులు అభివృద్ధి చేస్తున్నాం. భారత్ త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందన్నారు రాష్ట్రపతి.
గత పదేళ్లలో విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు అయింది. ప్రభుత్వం 100 పారిశ్రామిక పార్కులను నిర్మించాలని కూడా నిర్ణయించింది. పట్టణ ట్రాఫిక్ ను సజావుగా మార్చే పని కూడా నిరంతరం కొనసాగుతోంది కొన్నివారాల క్రితమే ఢిల్లీలో రిథాల, నరేలా, కొండ్లి కారిడార్ పనులు ప్రారంభమయ్యాయి. ఇది ఢిల్లీలో అతిపెద్ద మెట్రో కారిడార్ అవుతుంది. ఢిల్లీలో మెట్రో నెట్వర్క్ రెట్టింపు కంటే ఎక్కువైంది. భారతదేశంలో మెట్రో నెట్వర్క్ వెయ్యి కిలోమీటర్లకు పైగా పెరిగింది. భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద మెట్రో నెట్వర్క్గా అవతరించిందని వివరించారు.
మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు జరుగుతున్నాయి. దేశంలో 15 రోప్-వే ప్రాజెక్టులపై కూడా పనులు జరుగుతున్నాయి. సమాజంలోని ప్రతి వర్గానికి ఆరోగ్య సేవలు చేరడం ప్రభుత్వ ప్రాధాన్యత. కుటుంబంలో ఆరోగ్య ఖర్చులు తగ్గుతున్నాయి. ఆయుష్మాన్ భారత్ పథకం కింద 70ఏళ్లు పైబడిన ఆరు కోట్ల మంది వృద్ధులకు ఆరోగ్య బీమాను అందిస్తున్నాం. తొమ్మిది కోట్ల మంది మహిళలకు గర్భాశయ క్యాన్సర్ పరీక్షలు జరిగాయి. బ్రెయిన్ ఫీవర్ను ఎదుర్కోవడంలో దేశం గణనీయమైన విజయాన్ని సాధించింది. టీబీ రోగుల సంఖ్య కూడా తగ్గింది. టీబీ ఫ్రీ ఇండియా ప్రచారాన్ని విజయవంతం చేయడానికి సహకరించండి అంటూ పిలుపునిచ్చారు. రాబోయే 5 సంవత్సరాలలో వైద్య కళాశాలల్లో 75 వేల సీట్లను పెంచేందుకు కూడా ప్రభుత్వం కృషి చేస్తోంది. అనేక కొత్త ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. రైతులకు వారి పంటలకు న్యాయమైన ధరలు లభించేలా ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోంది. నేడు భారతదేశం ప్రపంచంలోనే పాలు, పప్పులు, సుగంధ ద్రవ్యాలలో అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉందని వెల్లడించారు.
అభివృద్ధి చెందిన భారతదేశాన్ని సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యం. దేశంలోని 25 కోట్ల జనాభాను దారిద్య్రరేఖకు ఎగువకు తీసుకువచ్చారు. 75 ఏళ్లు పైబడిన వారు, పెన్షన్ మాత్రమే పొందుతున్న వారు, ఆదాయపు పన్ను దాఖలుకు సంబంధించి సొంతంగా నిర్ణయం తీసుకునే హక్కును పొందారు. గృహ రుణాలపై సబ్సిడీ ఇస్తున్నారు. మహిళలను సాధికారపరచడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.స్టార్టప్ ఇండియా నుండి డిజిటల్ ఇండియా వరకు ఉన్న పథకాలను ప్రస్తావిస్తూ ఉపాధి అవకాశాలను రాష్ట్రపతి వివరించారు.కోటి మంది యువతకు ఇంటర్న్షిప్ ఏర్పాటు ద్వారా వారికి పని అనుభవం లభిస్తుందన్నారు. నలంద విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవం, ఇస్రో ఉపగ్రహాన్ని విజయవంతంగా ఏర్పాటు చేయడం గురించి రాష్ట్రపతి ప్రస్తావించారు. భారతదేశంలో నిర్మించిన గగన్యాన్లో వ్యోమగాములు కూడా అంతరిక్షంలోకి వెళ్లే రోజు ఎంతో దూరంలో లేదని అన్నారు.
13 భారతీయ భాషలలో పోటీ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్రపతి ప్రస్తావించారు. దేశంలో ఉన్నత విద్యా సంస్థల సంఖ్య కూడా పెరిగిందని అన్నారు. నేడు భారతదేశం సాంకేతిక రంగంలో ప్రపంచానికి మార్గం చూపుతోంది. అంతరిక్ష డాకింగ్ రంగంలో కూడా మనం విజయం సాధించాము. ప్రభుత్వం పన్ను వ్యవస్థను సరళీకరించింది. చిన్న పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నారు. యూపీఐ వంటి సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఆన్లైన్ లావాదేవీల సౌకర్యంతో దేశ ఆర్థిక వ్యవస్థ బలపడింది. వీధి వ్యాపారులకు రుణ ప్రయోజనం లభించింది. ప్రభుత్వం మిషన్ మౌసమ్ను ప్రారంభించిందని, ఇది రైతులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. బాబా సాహెబ్ సూత్రాలను అనుసరించి ప్రభుత్వం రెండు నదుల అనుసంధాన ప్రాజెక్టుల పనిని ప్రారంభించింది. ఎనిమిది లక్షల సహకార సంస్థలు, వాటి వాటాదారులు భారతదేశంలో 90 శాతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అనేక ఉపాధి అవకాశాలు సృష్టించబడ్డాయి. 2025 ను అంతర్జాతీయ సహకార సంవత్సరంగా జరుపుకుంటున్నారు. నేడు, ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధికి మద్దతు ఇస్తున్నారని ప్రశంసించారు రాష్ట్రపతి.
పొలవరంకు అధిక ప్రాధాన్యత ….
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కృషి చేస్తున్నాం. పోలవరం నిర్మాణానికి రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. సైబర్ సెక్యూరిటీలో సమర్థత పెంచుతున్నాం. దేశ ఆర్థిక, సామాజిక, జాతీయ భద్రతకు పని చేస్తున్నాం. డిజిటల్ మోసాలు, సైబర్ క్రైమ్, డీప్ ఫేక్ పెనుముప్పుగా మారాయి. దళితులు, వెనకబడిన వర్గాలకు ప్రభుత్వ అభివృద్ధి ఫలాలు అందిస్తున్నాం. ఆదివాసీ ప్రాంతాల్లో 30 వైద్య కళాశాలలు ప్రారంభించాం. అమృత్ భారత్, నమో భారత్ రైళ్లు అందుబాటులోకి తెచ్చాం. ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. పెరుగుతున్న క్యాన్సర్ కేసుల దృష్ట్యా ఔషధాలపై కస్టమ్స్ సుంకం తగ్గించామని” చెప్పారు.
దేశవ్యాప్తంగా 770 కి పైగా ఏకలవ్య మోడల్ పాఠశాలల్లో విద్యను అందిస్తున్నారు, గిరిజన ప్రాబల్య ప్రాంతాల్లో 30 కొత్త వైద్య కళాశాలలు ప్రారంభించబడ్డాయి,ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధితో పాటు, ప్రభుత్వం తూర్పు రాష్ట్రాల అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికపై పని చేయడం ప్రారంభించింది. అనేక అభివృద్ధి పథకాలను ప్రారంభించడం ద్వారా అండమాన్, లక్షద్వీప్లకు ముఖ్యమైన స్థానం లభించింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత, జమ్మూ కాశ్మీర్లో కొత్త అభివృద్ధి వాతావరణం ఏర్పడిందని పేర్కొన్నారు.
ప్రభుత్వం రాబోయే తరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటోంది. దేశాన్ని గ్రీన్ ఎనర్జీ వైపు తీసుకెళ్తోంది. ప్రధానమంత్రి సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం కింద రూ.75 వేల కోట్ల వ్యయంతో పైకప్పుపై సౌర వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నారు, ఇది ఉపాధిని కూడా సృష్టిస్తుంది. అణుశక్తిని విస్తరించడానికి కూడా కృషి చేస్తోంది. పాత వాహనాలను పారవేయడం ద్వారా ఉపాధి అవకాశాలను కూడా సృష్టించేందుకు కొత్త స్క్రాపింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దేశప్రజలు అమ్మ పేరు మీద ఒక చెట్టు ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రపంచం కూడా దీనిని ప్రశంసించింది.మనం కలిసి ముందుకు సాగితే, మన భవిష్యత్ తరాలు 2047 లో అభివృద్ధి చెందిన భారతదేశాన్ని ఖచ్చితంగా చూస్తారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడించారు..