ఇంటింటికీ సంక్షేమం చేరుస్తు కూటమి ప్రభుత్వం..

  • పశ్చిమ నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి బుద్ధ వెంకన్న..
  • 52వ డివిజన్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళుల
  • అనంతరం ‘ఇంటింటి తెలుగుదేశం’ కార్యక్రమం..
  • వృద్ధులకు ఇంటి వద్దే పెన్షన్లు..
  • కూటమి పాలనపై ప్రజలు సంతృప్తి వ్యక్తం

(విజయవాడ, ఆంధ్రప్రభ) : ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని ఇంటింటికీ సంక్షేమం చేరవేయడమే మా లక్ష్యం అని, ప్రజల విశ్వాసానికి తగ్గట్టుగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత వేగంగా అమలు చేస్తాం” అని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి బుద్ధా వెంకన్న అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 52వ డివిజన్ అధ్యక్షుడు ఈగల సాంబ ఆధ్వర్యంలో రావిచెట్టు సెంటర్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ‘ఇంటింటి తెలుగుదేశం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో బుద్ధా వెంకన్నతో పాటు నూర్‌బాషా చైర్మన్ కె. నాగుల్ మీరా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం వృద్ధుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేశారు. కొండప్రాంత ప్రజలు కూటమి ప్రభుత్వ పాలనపై సంతోషం వ్యక్తం చేస్తూ నాయకులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లకు పెన్షన్ రూ.3,000కు చేరిందని, ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో పెన్షన్‌ను రూ.4,000కు పెంచిందన్నారు.

ఎన్నికల హామీల మేరకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ‘తల్లికి వందనం’ వంటి పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. గత ప్రభుత్వం ఇంట్లో ఒక్క విద్యార్థికే పరిమితమైన సాయం అందించిందని, ప్రస్తుతం అర్హులైన ప్రతి విద్యార్థికి ప్రభుత్వం ప్రయోజనం కల్పిస్తోందన్నారు. నంద్యాలలోని ఒక మైనారిటీ కుటుంబానికి చెందిన 11 మంది పిల్లలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించిన విషయాన్ని ఉదాహరణగా ప్రస్తావించారు. డీఎస్సీ నియామకాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను ప్రస్తావిస్తూ, మొత్తం 3,36,307 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకాగా, 16,347 మందికి ఉద్యోగాలు లభించాయని, ఎక్కడైనా అవినీతి లేదా పక్షపాతం జరిగి ఉంటే బహిరంగ చర్చకు రావాలని మంత్రి నారా లోకేష్ విసిరిన సవాల్‌ను గుర్తు చేశారు.

గత ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్‌సీపీని 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేసి తీర్పు ఇచ్చారని, ఇదే ధోరణి కొనసాగితే మరింత దారుణ పరిస్థితి ఎదురవుతుందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వర్లు (చంటి), నందం భవానీ ప్రసాద్, గోలి శ్రీను, జనసేన 52వ డివిజన్ అధ్యక్షుడు నల్లబిల్లి కనకారావు, ఎస్. ఏడుకొండలు, గణప రాము, పాలాంటి గంగాధర్, చీపుల్ల వెంకటేశ్వరరావు, తాడిచెట్టు అశోక్, దేవర కళ్యాణ్, దాసరి రమణ, నాగోతి వెంకటేష్, బోను నరేంద్ర, మాచర్ల నరసింహారావు, రాఘవ, కుంది రాము, కొల్లి దుర్గారావు, నాగరాజు, పాలాంటి ఆదినారాయణ, శ్రీను, గుర్రం వెంకటేశ్వరరావు, నూకరాజు, సారేపల్లి వినయ్‌తో పాటు టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.