హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల వేదికగా జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ రద్దయింది. భద్రతా కారణాల దృష్ట్యా పంజాబ్ కింగ్స్ – ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ను నిర్వాహకులు నిలిపివేశారు.
ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మ్యాచ్ రద్దు నిర్ణయం తీసుకున్నట్లు ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటించారు. సరిహద్దుల్లో భారత్ -పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో మ్యాచ్ నిర్వహించడం సురక్షితం కాదని భావించిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
దీంతో క్రీడాభిమానులను నిరాశకు గురయ్యారు. అయితే, మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ మళ్లీ జరుగుతుందనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ పరిణామాలపై మరిన్ని వివరాలను ప్రకటిస్తామని ఐపీఎల్ బోర్డు తెలిపింది.
ప్రేక్షకులను మైదానం నుంచి వెళ్లిపోవాలని నిర్వాహకులు కోరారు. ఇది ఆటగాళ్ల భద్రతను కాపాడడమే కాకుండా, ప్రేక్షకులకు కూడా సురక్షిత వాతావరణం కల్పించడమే లక్ష్యంగా తీసుకున్న నిర్ణయమని పేర్కొన్నారు. అయితే, ఇప్పటికే ఈ నెల 11న జరగాల్సిన పంజాబ్ – ముంబై మ్యాచ్ను ధర్మశాల నుండి అహ్మదాబాద్కు తరలించారు.
కాగా, నేటి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసింది. పంజాబ్ ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (34 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సులు, 70 పరుగులు) అర్ధశతకం సాధించగా, ప్రభ్ సిమ్రాన్ సింగ్ (28 బంతుల్లో 7 ఫోర్లు, 50 పరుగులు) నాటౌట్ గా అర్ధశతకం అందుకున్నారు. ఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాటౌట్ (0) గా నిలిచారు.
ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ కేవలం 8.5 ఓవర్లలోనే 100 పరుగులు సాధించింది. ఇక 10.1 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 122 పరుగులు నమోదు చేసింది. అయితే 10.1 ఓవర్ కి మ్యాచ్ ను నిలిపివేశారు.
కాగా, ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ మొదటి 10 ఓవర్లలో చేసిన అత్యధిక పరుగులు:
132/1 vs కేకేఆర్, కోలకతా, 2024
131/3 vs ఎస్ఆర్హెచ్, హైదరాబాద్, 2014
126/1 vs ముంబై, వాంఖడే, 2017
122/0 vs ఢిల్లీ, ధర్మశాల, 2025 (ఈరోజు)
120/2 vs ఎస్ఆర్హెచ్, హైదరాబాద్, 2025