Varanasi |బడ్జెట్ ఎంత..? టార్గెట్ ఎంత..?

Varanasi |బడ్జెట్ ఎంత..? టార్గెట్ ఎంత..?
Varanasi | ఇటీవల వారణాసి మూవీ గ్లింప్స్
Varanasi | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి.. ఈ క్రేజీ కాంబినేషన్లో రూపొందుతోన్న క్రేజీ పాన్ వరల్డ్ మూవీ వారణాసి (Varanasi). ఇటీవల ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఈ సినిమా పై ఆకాశమే హద్దు అనేలా అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో మహేష్ బాబు, ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు నటిస్తున్నారు. అయితే.. ఈ భారీ పాన్ వరల్డ్ మూవీకి బడ్జెట్ ఎంత..? వసూలు చేయాల్సిన టార్గెట్ ఎంత..? అనేది అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అయ్యింది. వీటితో పాటు వారణాసి గ్లింప్స్ రిలీజ్ తర్వాత వివాదాలు కూడా వచ్చాయి. ఇంతకీ… వారణాసి బడ్జెట్ ఎంత..? దీని టార్గెట్ ఎంత..? అలాగే వివాదాలు ఏంటి..?
తెలుగు సినిమా పాతిక, ముప్పై ఏళ్ల క్రితం భారీ బడ్జెట్ అంటే.. 20 కోట్లు ఉండేది. అది కాస్తా కాలంతో పాటు పెరుగుతూ వచ్చింది. 40 కోట్లు, 50 కోట్లు నుంచి 100 కోట్లు కలెక్ట్ చేయడం అంటే.. చాలా గొప్పగా ఉండేది. ఆతర్వాత తెలుగు సినిమా బడ్జెట్టే 100 కోట్లకు చేరుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన పోకిరి దాదాపు 40 కోట్లు కలెక్ట్ చేసి తెలుగు సినిమా చరిత్రలో హయ్యస్ట్ కలెక్ట్ చేసిన మూవీగా ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఆతర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో రూపొందిన మగధీర సినిమా దాదాపు 75 కోట్లు కలెక్ట్ చేసి అత్యధిక కలెక్షన్ వసూలు చేసిన తెలుగు సినిమాగా చరిత్ర సృష్టించింది.
Varanasi | బాలీవుడ్ కూడా టాలీవుడ్ వైపు చూసేలా
ఇక బాహుబలి సినిమాతో రాజమౌళి సంచలనం సృష్టించారు. బాలీవుడ్ కూడా టాలీవుడ్ వైపు చూసేలా చేశారు. బాహుబలి 2 సినిమా 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసి.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 1000 కోట్లు కలెక్ట్ చేసి తొలి భారతీయ సినిమాగా చరిత్ర సృష్టించింది. జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ రావడంతో హాలీవుడ్ సైతం టాలీవుడ్ వైపు చూసింది. ఈ సినిమా కూడా 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఆతర్వాత పుష్ప 2, కల్కి, సలార్ సినిమాలు 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేయడం విశేషం. ఇలా తెలుగు సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేస్తుండడం గర్వించదగ్గ విషయం.
ఇక.. వారణాసి బడ్జెట్ విషయానికి వస్తే.. ఈ మూవీ బడ్జెట్టే 1000 కోట్లు అని ప్రచారం జరిగింది కానీ.. ఈ క్రేజీ మూవీకి ఇప్పుడు 1300 కోట్లు బడ్జెట్ అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే.. ఈ సినిమా టార్గెట్ ఎంత అనేది ఆసక్తిగా మారింది. ఏమాత్రం డౌట్ లేకుండా 2,000 కోట్లు కలెక్ట్ చేయడం ఖాయమని వార్తలు వచ్చాయి కానీ.. తాజాగా వారణాసి ఈజీగా 3,000 కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ క్రేజీ పాన్ వరల్డ్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇంకా క్లారిటీ లేదు కానీ.. ఇప్పటి నుంచే వారణాసి బడ్జెట్ అండ్ కలెక్షన్స్ గురించి డిష్కసన్ జరుగుతుండడం విశేషం.

Varanasi | ఫిల్మ్ ఛాంబర్లో అధికారికంగా ఫిర్యాదు
వివాదాల విషయానికి వస్తే.. సీహెచ్ సుబ్బారెడ్డి రామభక్త హనుమ క్రియేషన్స్ పేరుతో ఫిల్మ్ ఛాంబర్లో వారణాసి అనే టైటిల్ మూడు భాషల్లో రిజిస్టర్ చేసుకున్నట్టు తేలింది. ఇటీవల ఈ సినిమా టైటిల్ ను సుబ్బారెడ్డి ప్రకటించారు. అయితే.. రాజమౌళి వారణాసి అనే టైటిల్ ను ఎవరైనా రిజిస్టరర్ చేయించారా..? లేదా..? అనేది చూసుకోలేదో..? ఒకవేళ ఎవరైనా రిజిస్టర్ చేయించున్నా.. తను అడిగితే ఇస్తారనే నమ్మకంతోనో తన సినిమాకి వారణాసి అనే టైటిల్ ప్రకటించారు. దీంతో ఈ టైటిల్ ముందుగా తను రిజిస్టర్ చేయించుకున్నానని సుబ్బారెడ్డి ఫిల్మ్ ఛాంబర్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు.
ఈ వివాదాన్ని సెటిల్ చేసుకుంటారా..? లేక వారణాసి ముందు మహేష్ అని చేర్చి మహేష్ వారణాసిగా పెడతారా..? ఏం జరగనుంది అనేది ఆసక్తిగా మారింది. మరో విషయం ఏంటంటే.. వారణాసి వేడుకలో రాజమౌళి హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారని అభ్యంతర వ్యక్తం చేస్తూ ఆయన పై కేసు నమోదు అయ్యింది. ఇలా వారణిసి టైటిల్ అండ్ ఈవెంట్ వివాదస్పదం అవుతుందని జక్కన్న కూడా ఊహించి ఉండరు.
రాజమౌళి వివాదాలకు దూరంగా ఉండే మనిషి. ఇంకా చెప్పాలంటే.. సినిమా.. సినిమా.. సినిమా.. ఎప్పుడూ ఆయన ఆలోచన ఇదే. ఆయనకు సినిమా తప్పితే మరో ప్రపంచం తెలియదు. అంతలా సినిమా గురించి ఆలోచిస్తారు.. తపిస్తారు.. అందుకనే ఆయన సినిమాలు సంచలనం సృష్టించాయి.. చరిత్ర సృష్టించాయి. ఇదిలా ఉంటే.. ఆయన ఈవెంట్ లో మాట్లాడిన మాటలు వలన హిందువులు మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ కేసులు పెడుతున్నారు. బీజేపీ నాయకులు కూడా ఈ వివాదం పై స్పందిస్తున్నారు. బండి సంజయ్ కూడా రాజమౌళి వివాదం పై కామెంట్ చేయడంతో హాట్ టాపిక్ అయ్యింది. దీంతో ఈ వివాదం రోజురోజుకు మరింతగా పెరుగుతుంది. జక్కన్న మాత్రం సారీ.. చెప్పకుండా సైలంట్ గానే ఉన్నారు.
ఇప్పుడు సోషల్ మీడియా కాలం నడుస్తుంది. అందుచేత ఎవరైనా సరే.. మీటింగ్స్, ఈవెంట్స్ లో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏమాత్రం మాట జారినా.. సోషల్ మీడియా జనాలు వదలడం లేదు. ఎవరికి తీచినట్టుగా వాళ్లు కామెంట్స్ చేస్తూ వైరల్ చేస్తుంటారు. రాజమౌళి ఆ ఈవెంట్ లో ఒక డ్రోన్ సరిగా పని చేయకపోవడం వలన.. బాగా ఫీలయ్యారు. నాన్న గారు.. ఈ ఈవెంట్ సజావుగా జరగడం అంతా హనుమాన్ వెనకుండి చూసుకుంటారు అని చెప్పారు.. ఇదేనా చూసుకోవడం..? అంటూ ఎమోషనల్ అయ్యారు. అదే ఇప్పుడు పెద్ద తప్పు అయ్యింది. ఈ వివాదం గురించి ఎవరెవరో.. ఏదేదో మాట్లాడేస్తున్నారు. చూడాలి మరి.. వివాదాలు ఎలా పరిష్కారం అవుతాయో.. ప్రచారంలో ఉన్నట్టుగా వారణాసి 2,000 కోట్లు కలెక్ట్ చేస్తుందో..? 3,000 కోట్లు కలెక్ట్ చేస్తుందో..?
