హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి రాష్ట్రంలో వ్యవసాయం (Agriculture ) మాత్రమే కాదు విద్యా వ్యవస్థ (Education System ) కూడా కుంటుపడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS working President ) కేటీఆర్ (KTR) విమర్శించారు. వ్యవసాయ రంగం పట్ల నిబద్ధత లేదని, విద్యావ్యవస్థ పట్ల బాధ్యత లేదని మండిపడ్డారు. వానాకాలం సీజన్ మొదలవుతున్నా రైతుభరోసా అమలు విషయంలో ప్రణాళిక లేదని దుయ్యబట్టారు. పాఠశాలలు ప్రారంభమైనా పాలకులు నిర్లక్ష్యం వీడడం లేదని చెప్పారు. ఈ మేరకు ఆయన నేడు తన ఎక్స్ ఖాతాలో ట్విట్ చేశారు..
అరకొర రుణమాఫీ, ఆచూకీ లేని రైతు భరోసా, అందని రైతుబీమా, ప్రాజెక్టులు పడావు పడ్డాయని విమర్శించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో పండగలా మారిన వ్యవసాయం, ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో తిరోగమనం వైపు పయనిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. వెయ్యికిపైగా సంక్షేమ గురుకులాల (Residential Schools ) ఏర్పాటుతో ఎవరెస్టు శిఖరం అధిరోహించిన తెలంగాణ విద్యావ్యవస్థ ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో అవస్థలు ఎదుర్కొంటున్నదని చెప్పారు.