TG | విద్యుత్ డిమాండ్కు తగినట్లుగా బొగ్గు ఉత్పత్తి, రవాణా పెరగాలి

  • అన్ని గనుల్లోనూ వేసవి జాగ్రత్తలు పాటించాలి
  • ప్రతీ ఉద్యోగి 8 గంటల పాటు పనిచేసేలా చర్యలు తీసుకోండి
  • అన్ని ఏరియాల జీఎంలకు సీఎండీ ఎన్.బలరామ్ ఆదేశం

తెలంగాణ తోపాటు దేశ వ్యాప్తంగా విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతోందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని థర్మల్ విద్యుత్ కేంద్రాల డిమాండ్ మేరకు…. బొగ్గు ఉత్పత్తి, రవాణా పెంచాలని సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ పేర్కొన్నారు. ఈరోజు (మంగళవారం) సాయంత్రం హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరూ జీఎంలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

సింగరేణితో ఇంధన ఒప్పందం ఉన్న అన్ని విద్యుత్ కేంద్రాలకు రోజుకు కనీసం 50 రేకుల వరకు బొగ్గును రవాణా చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో రక్షణతో నాణ్యమైన బొగ్గు ఉత్పత్తిని పెంచాలని సూచించారు. అలాగే ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అన్ని గనుల్లోనూ వేసవి జాగ్రత్త చర్యలను పాటించాలన్నారు.

ముఖ్యంగా చల్లటి నీటిని అందుబాటులో ఉంచడం, మజ్జిగ సరఫరాకు ఏర్పాట్లు చేసుకోవడం, రెస్టు షెల్టర్ల వద్ద కూలర్లను, అన్ని యంత్రాల్లో ఏసీ సరిగా పనిచేస్తుందా లేదా పరిశీలించాలన్నారు. రానున్న మూడు నెలల్లోనూ విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంటుందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తి, రవాణాకు విఘాతం కలగకుండా అన్ని కాంట్రాక్టులను ఆమోదం తెలిపిన విషయాన్ని గుర్తుచేశారు.

ఈ ఏడాది నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను ముందే చేరుకున్న కిష్టారం ఓసీ, పీకే ఓసీ-4, జీడీకే-5 ఓసీ, ఆర్జీ ఓసీ-2, ఆర్ కే -6 ఇంక్లైన్, ఆర్కే న్యూటెక్, ఎస్సార్పీ ఓసీ-2 గనుల అధికారులు, కార్మికులకు అభినందనలు తెలిపారు. కంపెనీ ఆస్తుల పరిరక్షణకు ఎస్టేట్స్, రక్షణ విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఆక్రమణలు చేస్తున్న వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కంపెనీలో పనిచేస్తున్న ప్రతీ ఉద్యోగి కూడా భోజన విరామం మినహా మిగిలిన 8 గంటల సమయాన్ని పూర్తిగా కంపెనీ అభివృద్ధికి, ఉత్పత్తి లక్ష్యాల సాధనకు కృషి చేసేలా ప్రతీ ఒక్క అధికారి చైతన్య పరచాలని పునరుద్ఘాటించారు. డ్యూటీల విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నా, మస్టర్ పడి బయట తిరుగుతున్నట్లు తెలిసినా వారిపై వెంటనే క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.

విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే వాళ్లు ఎవరైనా సరే ఉపేక్షించొద్దన్నారు. కంపెనీ మరో వందేళ్లు మనుగడ సాగించాలంటే పని సంస్కృతి మరింత మెరుగవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్టీపీపీలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన కార్బన్ డై యాక్సైడ్ నుంచి మిథనాల్ తయారీ ట్రయల్ రన్ విజయవంతం అవడం పట్ల సీఎండీ హర్షం వ్యక్తం చేశారు. కొద్ది రోజుల్లోనే పూర్తిస్థాయిలో మిథనాల్ ఉత్పత్తి చేసేలా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో సంస్థ డైరెక్టర్లు డి.సత్యనారాయణ రావు (ఈ అండ్ ఎం), ఎల్వీ సూర్యనారాయణ (ఆపరేషన్స్), కె.వెంకటేశ్వర్లు (పా, పి అండ్ పి), ఈడీ (కోల్ మూమెంట్) ఎస్ డి ఎం.సుభానీ, జీఎం(సీపీపీ) మనోహర్, జీఎం(మార్కెటింగ్) ఎన్.వి.రాజశేఖరరావు, అన్ని ఏరియాల జీఎంలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *