30 శాతం కమీషన్ లు అంటూ కెటిఆర్ ప్రస్తావన
తీసుకున్నట్లు నిరూపించాంటూ భట్టి సవాల్
మీ సభ్యులే అంటున్నారంటూ కౌంటర్
కెటిఆర్ క్షమాపణ చెప్పాలన్న కాంగ్రెస్ సభ్యులు
కెటిఆర్ వాఖ్యాలను రికార్డ్ ల నుంచి తొలగింపు
బిఆర్ఎస్ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలన్న డిప్యూటీ సిఎం
అభ్యంతరం వ్యక్తం చేసిన కెటిఆర్
మైక్ తనకు ఇవ్వాలని బిఆర్ఎస్ నేత డిమాండ్
తిరస్కరించిన స్పీకర్ – సభ నుంచి బిఆర్ఎస్ వాకౌట్
హైదరాబాద్ – రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టర్లు చేపట్టిన పనుల్లో 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారంటూ ప్రభుత్వంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ లో ఉన్న నేతలే అసెంబ్లీలో ఆ విషయంపై బహిరంగంగా చర్చించుకుంటున్నారని సభలో ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అగ్గిమీద గుగ్గిలం అయ్యారు.. అలాగే ఒక్కసారిగా
కాంగ్రెస్ సభ్యులు లేచి కెటిఆర్ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ సభ్యులకు వ్యతిరేకంగా సభలో నినాదాలు చేశారు. దీంతో అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
మాజీమంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మంత్రులు ఎందుకు ఎగ్జైట్ అవుతారు.. మంత్రులకు సంయమనం ఉండాలి అన్నారు. మేము అడుగుతాం.. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇవ్వలేదని అంటాం.. ఇక, 30 శాతం కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారని కేటీఆర్ అన్నారు. దీనిపై భట్టి మాట్లాడుతూ, మీ లాగా విలువలు లేని రాజకీయాలు చేయడం లేదని అన్నారు.. బిఆర్ఎస్ సభ్యులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు అంటూ మండిపడ్డారు. దోచుకున్న ది నువ్వు.. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసింది మీరు.. మాపై నిందలు వేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 శాతం కమిషన్ అని అడ్డగోలుగా మాట్లాడితే ఎలా. కేటీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలని భట్టి డిమాండ్ చేశారు. దమ్ముంటే తాను కమీషన్ లు తీసుకున్నట్లు నిరూపించాలని డిమాండ్ చేశారు.
అందుకు కెటిఆర్ నిరాకరిచడంతో ఆ వ్యాఖ్యాలను రికార్డ్స్ నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రకటించారు. ఇక భట్టి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, ఇక, కేటీఆర్ డెమోక్రసీ అంటున్నారని,.. పద్ధతిగా ఉంటారని అనుకున్నామన్నారు. అయితే ఆయన ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం పద్దతి కాదని భట్టి హితవు పలికారు. వాస్తవంగా చర్చ జరగకుండా సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు…. బీఆర్ఎస్ )లా తాము బరితెగించి రాజకీయాలు చేయడం లేదని మాటల తూటాలతో విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని పదేళ్ల పాటు పాలించి అడ్డగోలుగా దోచుకున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నాయకులు ఇకనైనా ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే భట్టి వ్యాఖ్యలపై కేటీఆర్, బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సభలో మాట్లాడేందుకు మైక్ ఇవ్వాలని స్పీకర్ కోరగా అందుకు ఆయన నిరాకరించారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేసి అసెంబ్లీ ప్రాంగణంలో నిరసనకు దిగారు.