ముచ్చటైన మ్యూజియం వేడుకలకు తరలిరండి..

ముచ్చటైన మ్యూజియం వేడుకలకు తరలిరండి..
ఈ నెల 18న మ్యూజియం డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు
బాపూ మ్యూజియం వేదికగా అలరించనున్న చారిత్రక, వారసత్వ ఉత్సవం
విజయవాడ, ఆంధ్రప్రభ : ఈ నెల 18న అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం (ఇంటర్నేషనల్ మూసేమ్ డే ) సందర్భంగా పండగలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు పర్యాటక శాఖ, పురావస్తు శాఖ, జిల్లా అధికార యంత్రాంగం.. జిజ్ఞాస ఆర్ట్ వెర్స్, ఇన్టాక్, ఆర్టీఐహెచ్ భాగస్వామ్యంతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. నగరంలోని బాపూ మ్యూజియంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. ఉదయం 6.30 గంటలకు బాపూ మ్యూజియం నుంచి మొఘల్రాజపురం గుహలు వరకు హెరిటేజ్ వాక్ ఉంటుంది.
ఉదయం 10 గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది. 10.30 గంటల నుంచి ప్రపంచ వ్యాప్తంగా విజయవాడ వారసత్వ ప్రాధాన్యం, మ్యూజియంలను మరింత ఆకర్షణీయంగా, అనుభూతిపరిచేలా తీర్చిదిద్దడంపై మేధోమధన చర్చలు జరుగుతాయి. 12.30 గంటలకు మా ఇంటి అమూల్య సంపద (ఇంట్లోని పురాతన వస్తువులను తీసుకొచ్చి వాటి వెనుక కథలను పంచుకునే ప్రత్యేక పోటీ, 11.30 గంటలకు చిత్రలేఖన పోటీ (హెరిటేజ్ ఆన్ కాన్వాస్)లు వారసత్వం, నదులు, దేవాలయాలు, నా నగర కథలు, భవిష్యత్తు మ్యూజియంల ఊహాచిత్రం అంశాలపై నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడ హెరిటేజ్ క్విజ్ (ఆరేళ్లు, పైబడిన వారికి) ఉంటుంది.
ముగ్గురు సభ్యులతో లేదా జట్టుగా నమోదు చేసుకోవచ్చు. అనంతరం ఆంధ్రప్రదేశ్లోని వారసత్వ కట్టడాలు, మ్యూజియంలు, వారసత్వంపై ఫొటోగ్రఫీ పోటీలు ఉంటాయి. రెండు గంటలకు బాపూ మ్యూజియంలోని ఏదైనా ఒక వస్తువును ఆధారంగా తీసుకొని 100 పదాలతో కల్పిత కథ రాయాలి. పాల్గొనేవారికి ప్రత్యేక మార్గదర్శనం ఉంటుంది. రోజంతా బాపూ మ్యూజియంలో ప్రత్యేక గైడెడ్ టూర్లు సందర్శకులకు ఉచితంగా అందుబాటులో ఉంటాయి. లేజర్ షో కూడా నిర్వహించబడుతుంది. ఈ నెల 18వ తేదీ సోమవారం సాయంత్రం ఇందిరాగాంధీ మునిసిపల్ మైదనంలో సంప్రదాయ కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ప్రముఖ టాలీవుడ్ గాయకుల సంగీత విభావరి జరుగుతుంది.
ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి…..
అనుభవజ్ఞులు, యువత, విద్యార్థులు, వివిధ సంస్థలు, జర్నలిస్టులు.. ఇలా ప్రతిఒక్కరూ కార్యక్రమాల్లో భాగస్వాములై ప్రత్యేక కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ కోరారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని.. వారసత్వ సంపదను సంరక్షిస్తూ సంస్కృతిని సజీవంగా నిలిపే జ్ఞాన నిలయాలే మ్యూజియాలని.. గత వైభవాన్ని నేటి తరానికి, నేటి సంస్కృతిని రేపటి తరానికి అనుసంధానించే వారధులని పేర్కొన్నారు. ఇంతటి విశిష్టత కలిగిన మ్యూజియంల చారిత్రక వారసత్వ ప్రతీకలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
