బావిలో ఈతకు వెళ్లి విద్యార్థి జలసమాధి
బావిలో ఈతకు వెళ్లి విద్యార్థి జలసమాధి
- మంగాపురంలో విషాద ఛాయలు
- కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు
గరిడేపల్లి, ఆంధ్రప్రభ : సరదాగా స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు బావిలో మునిగి మృతి చెందిన ఘటన గరిడేపల్లి మండల పరిధిలోని మంగాపురం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుండు అంజయ్య, వీరలక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు గుండు సాయి (16) నేరేడుచర్ల లోని గురుకుల పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నాడు. వేసవి సెలవులు కావడంతో మధ్యాహ్న సమయంలో తన స్నేహితులతో కలిసి గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావిలో ఈత కొట్టేందుకు వెళ్లాడు.
స్నేహితులంతా ఈత కొడుతుండగా, సాయి ప్రమాదవశాత్తు బావిలో లోతు ఉన్న ప్రాంతానికి వెళ్లి నీటిలో మునిగిపోయాడు. గమనించిన స్నేహితులు కేకలు వేయడంతో చుట్టుపక్కల పొలాల్లో ఉన్న రైతులు అక్కడికి చేరుకొని నీటిలో మునిగిన సాయిని బయటకు తీశారు. అయితే అప్పటికే సాయి మృతి చెందినట్లు గుర్తించారు.
చేతికి వచ్చిన కొడుకు విగతజీవిగా పడి ఉండటంతో తల్లిదండ్రులు అంజయ్య, వీరలక్ష్మిలు గుండెలవిసేలా విలపిస్తున్న తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించింది. మొదటి కుమారుడి మరణంతో ఆ కుటుంబంలో తీరని శోకం మిగిలింది. ఈ ఘటనతో మంగాపురం గ్రామంలో ఒకేసారి విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.
