నాగర్కర్నూల్, : నాగర్ కర్నూల్ జిల్లాలోని దోమల పెంట ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు 36వ రోజుకు చేరుకున్నాయి. సొరంగంలో చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు రెస్క్యూ బృందాలు నిర్విరామంగా కృషిచేస్తున్నాయి. ప్రమాదం జరిగి 36 రోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ ఇద్దరు ఇంజనీర్ల మృతదేహాలు మాత్రమే లభించాయి. మిగిలిన ఆరుగురి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. రోజు మాదిరిగానే శనివారం ఉదయం సైతం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి, ఆర్మీ, కేరళ పోలీస్ క్యాడవార్ డాగ్స్ వంటి రిస్క్యూ టీంలు సహాయ చర్యలు చేపట్టేందుకు సొరంగంలోకి వెళ్లాయి.
ఎస్ ఎల్ బి సి, టన్నెల్ లోపల సహాయక చర్యల లో పాల్గొంటున్న సహాయక బృందంలోని ఆర్మీఅధికారులు, వికాస్ సింగ్, విజయ్ కుమార్, సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, కల్వకుర్తి ఆర్డీవో శ్రీనివాసులు, ఎన్డీఆర్ఎఫ్ అధికారి కిరణ్ కుమార్, ఎస్డీఆర్ఎఫ్ అధికారి గిరిధర్ రెడ్డి, జిఎస్ఐ అధికారి పంకజ్ తిరుగున్, ర్యా ట్ హోల్ మైనర్స్ ప్రతినిధి ఫిరోజ్ ఖురేషి, హైడ్రా, దక్షిణ మధ్య రైల్వే అధికారులు, అన్వి రోబోటిక్స్ ప్రతినిధులు విజయ్, అక్షయ్, జేపీ కంపెనీ ప్రతినిధులు, లతో ఎస్ ఎల్ బి సి, టన్నెల్ ఇన్లెట్ 1 ఆఫీస్ లో ఎస్ ఎల్ బి సి, టన్నెల్ ప్రత్యేక అధికారి శివ శంకర్ లోతేటి సమీక్ష నిర్వహంచారు.
ఈ సందర్భంగా శివశంకర్ లోతేటి మాట్లాడుతూ …… సహాయక చర్యలలో భాగంగా ప్రతిరోజు నిర్దేశిత లక్ష్యంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు సహాయక బృందాలు రెట్టింపు వేగంతో సహాయక చర్యలు చేపట్టడంపై, ప్రమాద ప్రదేశం నుండి లోకో ఇంజన్ ని వెలికితీయడంపై సహాయక బృందాలను ప్రత్యేక అధికారి అభినందించారు. ఇదే స్ఫూర్తితో సహాయక చర్యలను కొనసాగించాలని సూచించారు.
ఎస్ ఎల్ బి సి, టన్నెల్ లోపల కొనసాగుతున్న సహాయక చర్యలలో సహాయక బృందాలు పూర్తిస్థాయిలో నిరంతరం శ్రమిస్తూ, సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నారన్నారు. సొరంగంలో ప్రమాదం జరిగిన ప్రదేశంలో మట్టి కింద కూరుకుపోయి వున్న లోకో ట్రైన్ క్యాబిన్లను, లోకో ఇంజన్ ను వెలికి తీసి, టన్నెల్ బయటకు తీసుకువచ్చినట్లు చెప్పారు. లోకో ట్రైన్ ఉన్నటువంటి ప్రదేశంలో మట్టిని తొలగించే పని పూర్తి చేసి,ప్రమాదంలో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తునట్లు చెరప్పారు. ,లోపలి ప్రదేశాలలో క్షుణ్ణంగా, పరిశీలిస్తూ సహాయక చర్యలు వేగవంతం చేస్తున్నారని వివరించారు. ఈ సహాయక చర్యల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 12 సహాయక బృందాలు సమన్వయంతో, పూర్తి స్థాయిలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. సహాయక బృందాల కు కావలసిన సామాగ్రిని అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వారికి అవసరమైన వసతులను సమకూరేల చర్యలు చేపట్టినట్లు ఎస్ ఎల్ బి సి, టన్నెల్ ప్రత్యేక అధికారి శివ శంకర్ లోతేటి, వివరించారు.
ప్రతి రోజూ నిరంతరాయంగా వస్తున్న ఊట నీటిని బయటకు తరలించే ప్రక్రియ, మట్టి తవ్వకాలు, స్టీలు ను తొలగించే ప్రక్రియ సమాంతరంగా జరుగుతున్నట్లు చెప్పారు. 4 ఎస్కేవేటర్లు,2 బాబ్ క్యాట్లు నిరంతరాయంగా మట్టిని తొలగిస్తూ , కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు తరలిస్తున్నట్లు వివరించారు. మట్టీ తవ్వకాలకనుగుణంగా కన్వేయర్ బెల్ట్ ను,వెంటిలేషన్ పునరుద్ధరణ పనులనూ చేపడుతున్నట్లు ప్రత్యేక అధికారి శివ శంకర్ లోతేటి, తెలియజేశారు.
ఇంత శ్రమిస్తున్న శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదన్న ఆవేదనతో అధికారులు, రెస్క్యూ బృందాలు, కార్మికులు ఉన్నారు. సొరంగంలోకి ఉబికి వస్తున్న నీటి ఊటను నిలువరిస్తే తప్ప సహాయక చర్యలు ముందుకు సాగవనేది రెస్క్యూ బృందాలు అభిప్రాయంగా ఉంది. ప్రత్యేక అధికారి శివశంకర్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ సలహాలు సూచనలు చేస్తూ అత్యాధునిక పరికరాలతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.