హైదరాబాద్ – గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ నూతన క్యాంపస్ను ఇవాళ ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం ఆయన మాట్లాడుతూ… హైదరాబాద్ లో మరో కొత్త మైక్రోసాఫ్ట్ ఫెసిలిటీని ప్రారంభించుకోవడం మనందరికీ గర్వకారణమన్నారు. హైదరాబాద్ జర్నీలో ఇదొక మైలురాయని తెలిపారు. మైక్రోసాఫ్ట్, హైదరాబాద్ మధ్య సుదీర్ఘ భాగస్వామ్యం ఉందని వెల్లడించారు. మైక్రోసాఫ్ట్ ఇండియా ఇటీవలే 25ఏళ్లు పూర్తి చేసుకుందని గుర్తు చేశారు.
హైదరాబాద్ నుంచి గ్లోబల్ ఇన్నోవేషన్, ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఘనత మైక్రోసాఫ్ట్ దేనని అన్నారు రేవంత్. మైక్రోసాఫ్ట్ విస్తరణతో తెలంగాణ యువతకు మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయని తెలిపారు. ఇది యువతకు మరింత సాధికారత కల్పిస్తుందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నానని ప్రకటించారు.
భవిష్యత్తు ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేనని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. మైక్రోసాఫ్ట్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏఐ ఫౌండేషన్ అకాడమీతో కూడిన ADVANTA(I) GE TELANGANA ను ప్రారంభించడంలో భాగస్వాములుగా ఉన్నాయని వెల్లడించారు.
