Phone Tapping Case | కెసిఆర్, కెటిఆర్ జైలుకు వెళ్లాల్సిందే – బిజెపి ఎంపి కొండా

హైదరాబాద్ – ఫోన్ ట్యాపింగ్ కు (Phone tapping ) పాల్పడిన మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, (kcr ) బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ (ktr ) లకు వారికి కచ్చితంగా శిక్ష పడాలని, వారిద్దరూ జైలుకు వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Konda visweswarareddy, ) . ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా శుక్రవారం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట విచారణకు ఆయన హాజరయ్యారు.
ఈ కేసు విచారణలో భాగంగా సిట్ అధికారులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విశ్వేశ్వర్రెడ్డిని ప్రశ్నించి, ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాను గతంలో ఫోన్ ట్యాపింగ్పై ఫిర్యాదు చేసినందుకే తనపై కక్షపూరితంగా తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. “గతంలో నా ఫోన్ చాలాసార్లు ట్యాప్ అయింది. దీనిపై నేను అప్పుడే ఫిర్యాదు చేశాను. ఇప్పుడు ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరగాలి” అని ఆయన అన్నారు.
భవిష్యత్తులో ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కేసీఆర్, కేటీఆర్లకు కఠిన శిక్ష విధించాలని విశ్వేశ్వర్రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ అంశాన్ని పార్లమెంటు సమావేశాల్లో కూడా ప్రస్తావించి, జాతీయ స్థాయిలో చర్చిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సమగ్రంగా నిరూపించేందుకు అవసరమైతే కేంద్ర ప్రభుత్వ సహాయం కూడా తీసుకోవాలని ఆయన సూచించారు.
