కూటమి పాలనపై ప్రజల్లో పెరిగిన విశ్వాసం: దేవినేని ఉమా
విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో నిర్వహించిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, హంద్రీ–నీవా ప్రాజెక్టును పూర్తి చేసి కుప్పంతో పాటు కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల చివరి ప్రాంతాల వరకు సాగు, తాగునీరు అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. రూ.36 వేల కోట్లతో 36 కీలక సాగునీటి ప్రాజెక్టులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం రహదారుల్లో గుంతలు కూడా పూడ్చకుండా వెళ్లిపోయిందని విమర్శించారు.
విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టి కోతలు లేని నాణ్యమైన విద్యుత్ అందించడంతో పాటు, రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ట్రూ-అప్కు బదులుగా ట్రూ-డౌన్ అమలు చేసి ప్రజలపై భారం తగ్గించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిదేనని పేర్కొన్నారు. మెగా డీఎస్సీ ద్వారా 16 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తుంటే, వందలాది కేసులు వేసి అడ్డుకునేందుకు ప్రయత్నించారని విమర్శించారు. మెగా డీఎస్సీపై బహిరంగ చర్చకు మంత్రి నారా లోకేష్ విసిరిన సవాల్ను స్వీకరించాలని, వారానికోసారి ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలు మానుకోవాలని ప్రతిపక్షాలను సూచించారు.
జగన్ పాలనలో ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని, కూటమి ప్రభుత్వం ప్రజల ఆస్తులకు పూర్తి భరోసా కల్పించిందన్నారు. అమరావతి అభివృద్ధి వేగంగా జరుగుతోందని, ప్రతిష్టాత్మక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు అమరావతిలో పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయని పేర్కొన్నారు. వైసీపీ కుట్రలను అధిగమించి సీడ్ యాక్సిస్ రోడ్డు పనులను విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. ఒకే రాజధాని – అభివృద్ధి వికేంద్రీకరణ కూటమి ప్రభుత్వ విధానమని, రాష్ట్ర సమగ్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని దేవినేని ఉమా స్పష్టం చేశారు.
