ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి అధికారులు సమిష్టిగా కృషి చేయాలి..
- సంక్షేమ పథకాల అమలు, అట్రాసిటీ కేసుల్లో వేగం పెంచాలి..
- రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి , ఆంధ్రప్రభ : జిల్లాలో షెడ్యూల్డ్ కులములు, షెడ్యూల్డ్ తెగల వారికి రాజ్యాంగం కల్పించిన చట్టాల ప్రకారం అభివృద్ధికి అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ఎస్.సి., ఎస్.టి. కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఎస్.సి., ఎస్.టి. లకు సంక్షేమ పథకాల అమలు, అట్రాసిటీ కేసులు, భూ సమస్యలు, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలలోని విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం, ఎస్.సి., ఎస్.టి. గ్రామాలలో మౌలిక వసతుల కల్పనపై జిల్లా కలెక్టర్ కె.హరిత, ఎస్.పి. నితికా పంత్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం.డేవిడ్, జిల్లా అటవీ అధికారి బాలమణి, ఆసిఫాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు కోవ లక్ష్మీ, ఎస్.సి., ఎస్.టి. కమిషన్ సభ్యులు రేణిగుంట్ల ప్రవీణ్, రాంబాబు నాయక్, కుసుం నీలాదేవి లతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ.. జిల్లాలో 1 లక్ష 33 వేల 627 మంది షెడ్యూల్డ్ తెగలు, 81 వేల 596 మంది షెడ్యూల్డ్ కులముల వారు ఉన్నారని, రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం సంక్షేమ పథకాలు వర్తించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలలో చదివే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, ఏకరూప దుస్తులు అందించాలని, వసతి గృహాలు, గురుకులాలలో చదివే విద్యార్థులకు మెనూ ప్రకారం పోషక విలువలతో కూడిన భోజనం అందించాలని, 10వ తరగతి ఉత్తీర్ణత శాతం పెంచేలా నాణ్యమైన విద్యను అందించాలని తెలిపారు.
షెడ్యూల్డ్ కులములు, తెగల ప్రజలు నివసిస్తున్న గ్రామాలకు రహదారి సౌకర్యం, త్రాగునీటిని అందించాలని, రహదారి నిర్మాణాలకు అటవీ శాఖ అనుమతులు త్వరగా జారీ చేయాలని తెలిపారు. అట్రాసిటీ కేసులను త్వరగా విచారించి నిందితులకు శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని, అట్రాసిటీ బాధితులకు త్వరగా పరిహారం అందించాలని తెలిపారు. జిల్లాలో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలలో షెడ్యూల్డ్ కులములు, షెడ్యూల్డ్ తెగలను ప్రోత్సహించాలని, ఉపాధి కల్పనలో ప్రాధాన్యత కల్పించాలని తెలిపారు.
ప్రతి నెల 30వ తేదీన నిర్వహించే పౌర హక్కుల దినోత్సవానికి మండల స్థాయి అధికారులు తహసిల్దార్, ఎస్.ఐ.లు తప్పనిసరిగా హాజరై ఎస్.సి., ఎస్.టి. చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఉపాధి హామీ పథకం క్రింద షెడ్యూల్డ్ తెగలు, కులముల అర్హత గల కుటుంబాలకు 100 రోజుల పని కల్పించాలని తెలిపారు. రెవెన్యూ అటవీ శాఖల మధ్య ఉన్న భూముల వివాదాలను ఉమ్మడి సర్వే నిర్వహించి పరిష్కరించుకోవాలని, ప్రభుత్వ పథకాలలో షెడ్యూల్డ్ కులములు, తెగలకు వారి హక్కుల ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేయాలని తెలిపారు. మున్సిపాలిటీలలో పారిశుద్ధ్య కార్మికులకు పి.ఎఫ్. అమలు, బీమా సౌకర్యాన్ని కల్పించాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ షెడ్యూల్డ్ తెగలు, కులములవారికి అందవలసిన సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. షెడ్యూల్డ్ కులములు, తెగలవారు నివసించే గ్రామాలలో రహదారి పనులు, పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు, ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు అటవీశాఖ అధికారులు త్వరగా అనుమతులు ఇచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని తెలిపారు. ఎస్.సి., ఎస్.టి. సబ్ ప్లాన్ నిధులను వారి ప్రాంతాలలో ఖర్చు చేసే విధంగా, గిరిజనేతరులు సాగు చేసే పోడు భూముల సమస్యను పరిష్కరించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి దాసరి వేణు, ఆసిఫాబాద్, కాగజ్ నగర్ రాజస్వ మండల అధికారులు లోకేశ్వర్ రావు, చెన్నూరి కిష్టయ్య, డి.ఎస్.పి.లు అశోక్, వహీదుద్దీన్, జిల్లా అధికారులు, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
