Mumbai Heavy Rains | ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు

Mumbai Heavy Rains | ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు

Mumbai Heavy Rains | 8 గంటల్లో 320 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం
ముంపులో చిక్కుకున్న లోతట్టు ప్రాంతాలు
అస్తవ్యస్తమైన ట్రాఫిక్, రైలు సేవలు
డ్రైనేజీ లోపాలపై తీవ్ర విమర్శలు
మరిన్ని భారీ వర్షాలకు వాతావరణ శాఖ హెచ్చరిక

Mumbai Heavy Rains | ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబై నగరం రాత్రి పడిన పెను వర్షాలతో ముంపునకు గురైంది. 13 రోజులు ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు నగరంలోకి ప్రవేశించడం విపత్తుకు దారి తీసింది. జూన్ 23 రాత్రి 10 గంటల నుంచి జూన్ 24 ఉదయం 6 గంటల వరకు ముంబైలోని అనేక ప్రాంతాల్లో 8 గంటల్లో 320 మిల్లీమీటర్లకు మించి వర్షపాతం నమోదైంది.

భారీ వర్షాలతో అనేక చోట్ల నిలిచిపోయిన వరదనీరు చెరువులను తలపించింది. రోడ్డు ట్రాఫిక్ పూర్తిగా అస్తవ్యస్తమైంది. భారీ వర్షాలు నగరంలోని లోతట్టు ప్రాంతాలను ముంచేశాయి. సబర్బన్ రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. వేలాది మంది ప్రయాణికుల రోజువారీ ప్రయాణాలు దెబ్బతిన్నాయి.

ముంబై, పరిసర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను భారత వాతావరణ శాఖ జారీ చేసింది. వరదల ఆస్కారం ఉందని హెచ్చరికలు ఇచ్చింది. సహాయక చర్యల్లో అలసత్వం పట్ల పౌవైలో నివాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వరద నీటిలో భైఠాయించి నిరసన తెలిపారు.

అంధేరి, మాలాడ్, దాదర్ వంటి ప్రాంతాల్లో సబ్‌వేలు, రోడ్లు నీటితో నిండిపోయాయి. ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. వాతావరణ శాఖ మరిన్ని ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించింది. ముంబైలో భారీ వర్షాల నేపథ్యంలో మేయర్ రితు తావ్డే నీటి ముంపులు, డ్రైనేజీ వ్యవస్థలను పరిశీలించడానికి మాతుంగా ప్రాంతంలో పర్యటించారు. ఈ సమయంలో బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన పారిశుద్ధ్య కార్మికుడు ఓపెన్ డ్రైన్‌లో సమతుల్యం కోల్పోయి పడ్డారు. ఈ ఘటన కెమెరాలో రికార్డు అయింది. కార్మికుడు సురక్షితంగా బయటపడ్డారని సమాచారం.

ఈ ఘటన సివిక్ సేఫ్టీ, డ్రైనేజీ వ్యవస్థలోని లోపాలను హైలైట్ చేసింది. గత రాత్రి భారీ వర్షంలో కూడా 7,000 మంది సిబ్బంది డ్రైన్లు శుభ్రం చేసి నీటి నిల్వలను త్వరగా తొలగించారు. అయినా కొన్ని కీలక ప్రాంతాల్లో (29 స్పాట్లు) పనులు ఇంకా పూర్తి కాలేదు. అడ్డంకులు, ఎన్‌క్రోచ్‌మెంట్లు సమస్యలు కలిగిస్తున్నాయి. ఈ చర్యల వల్ల నగరం మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ, పూర్తి పరిష్కారం కోసం మరిన్ని పనులు కొనసాగాల్సి ఉంది. ప్రజలు డ్రైన్లలో చెత్త వేయకుండా సహకరించాలని అధికారులు కోరుతున్నారు.