ఆర్టీసీ బస్సులో మహిళ పర్సు చోరీ!

  • పర్సు పోయిందంటూ మహిళ ఆందోళన..
  • ప్రయాణికులతో బస్సును పోలీస్‌స్టేషన్‌కు తరలింపు
  • చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌ వద్ద ప్రయాణికుల అవస్థలు

మచిలీపట్నం, ఆంధ్రప్రభ: మచిలీపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఆర్టీసీ ప్రయాణికుల బస్సులో ఓ మహిళ పర్సును గుర్తుతెలియని వ్యక్తులు అపహరించిన ఘటన సోమవారం కలకలం రేపింది. ప్రయాణికులతో కిక్కిరిసిన బస్సులో చోరీ జరగడంతో తోటి ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.

మచిలీపట్నం నుంచి ఉయ్యూరు వెళ్తున్న బిందు అనే మహిళ తన పర్సు కనిపించడం లేదని గుర్తించి బస్సులోనే ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో బస్సును చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

పోలీస్‌స్టేషన్‌కు కిక్కిరిసిన బస్సు..

ప్రయాణికులతో నిండిన బస్సును అకస్మాత్తుగా పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమ గమ్యస్థానాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు బస్సులోనే ఉండిపోవడంతో అసౌకర్యానికి గురయ్యారు. పర్సులో కొంత మొత్తం నగదు విలువైన వస్తువులు ఉన్నాయని బాధితురాలు చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేసింది.