ఘనంగా మహేష్ బాబు జన్మదిన వేడుకలు..

అనంతపురం ప్రతినిధి, ఆంధ్రప్రభ: సినీ నటుడు, సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు 51వ జన్మదిన వేడుకలను జిల్లా వ్యాప్తంగా అభిమానులు ఘనంగా నిర్వహించారు. పలుచోట్ల అభిమానులు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆదివారం స్థానిక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వద్ద కృష్ణ–మహేష్‌ సేన ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

కృష్ణ–మహేష్‌ సేన నాయకుడు కేఆర్‌ కుళ్లాయప్ప ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మాజీ మేయర్‌ రాగే పరశురామ్‌ ముఖ్య అతిథిగా హాజరై కేక్‌ కట్‌ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభిమానులు తమ అభిమాన నటులను ఆదర్శంగా తీసుకుని పెద్దఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులోనూ సేవా కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు.

మహేష్‌బాబు గుండె జబ్బులతో బాధపడుతున్న పలువురు పేదలకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపారని తెలిపారు. ఆయన స్ఫూర్తితో కృష్ణ–మహేష్‌ అభిమానులు మరింత చురుగ్గా సామాజిక సేవలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు ఆలమూరు శ్రీనివాసరెడ్డి, కృష్ణ–మహేష్‌ సేన నాయకులు రవిరాజ్‌, నారాయణరెడ్డి, రఫీ, శేఖర్‌, హరి, వెంకటేష్‌, రఘు, ప్రభుదాస్‌, అరవింద్‌, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.