రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలి
సొంతూరులోని శివాలయంలో ప్రత్యేక పూజలు
జాతరలో చిన్ననాటి దోస్తులతో కలిసి పర్యటన
స్వీట్లు పంచుతూ సందడి చేసిన భట్టి
ఖమ్మం, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రజలు సభిక్షంగా ఉండాలని, ప్రపంచంలో తెలుగు ప్రజలు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని ఆ శివపార్వతులను వేడుకున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. భార్య నందినితో కలిసి నేటి ఉదయం స్వగ్రామమైన వైరా మండలం స్నానాల లక్ష్మిపురంలోని పురాతన శివాలయంలో, మధిర నియోజకవర్గ కేంద్రంలోని శివాలయంలో పూజలు నిర్వహించారు.

జాతరలో స్వీట్లు పంచుతూ..
శివరాత్రి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పేరిట దేవాలయాల్లో పూజలు చేయించారు. ప్రజాసంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వానికి శివపార్వతుల ఆశీస్సులు ఉండాలని ఉప ముఖ్యమంత్రి పూజలు నిర్వహించారు. స్నానాల లక్ష్మీపురంలో శివపార్వతుల పూజ అనంతరం జాతరలో ఏర్పాటుచేసిన దుకాణాల్లో చిన్ననాటి మిత్రులతో కలిసి కలియతిరిగారు. మిఠాయిలు కొనుగోలు చేసి మిత్రులకు పంచుతూ ఆనందంగా గడిపారు. ఆలయ పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు. కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురామరెడ్డి, గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.