Kannepalli | వాగులను తోడేస్తున్నారు

Kannepalli | వాగులను తోడేస్తున్నారు
- కన్నెపల్లి మండలంలో ఇసుక మాఫియా
- అనుమతులు లేకుండా ఇసుక తరలింపు
- పట్టించుకోని రెవెన్యూ అధికారులు
Kannepalli | కన్నెపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని కన్నెపల్లి మండలంలో ట్రాక్టర్ల (Tractor) యజమానులు మాపియా ఏర్పడి అధికార, ప్రతి పక్ష బడా నేతల అండదండలతో వాగులు, వంకల నుంచి ఇసుకను తోడేస్తున్నట్లు సమాచారం. మండల కేంద్రంలోని వాగు నుంచి ముత్తాపూర్, తాళ్ల రెబ్బన, సాలిగాం, మాడవెల్లి, గొల్లగట్టు, వీరాపూర్ గ్రామాలకు కొందరు ట్రాక్టర్ యజమానులు విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇసుక జజ్జరవెళ్లి వాగు నుంచి దాంపూర్, జనకాపూర్, కొత్తపల్లి, టేకులపల్లి, గ్రామాలకు.. అంతేకాదు వాగుల నుంచి ఇసుక ఇష్టానుసారంగా అడ్డూఅదుపు లేకుండా తోడేస్తున్నా మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ప్రజల నుంచి వస్తున్నాయి.

మండలం లో 60 నుంచి 80కి పైగా ఉన్న ట్రాక్టర్లతో ఇందిరమ్మఇళ్ళ లబ్ధిదారులను ఆసరాగా, అవకాశంగా చేసుకొని ఇసుక అక్రమ దందాకు తెరలేపారని మండలంలో చర్చనీయాంశంగా మారింది. ఒక్కొక్క ట్రాక్టర్ ఇసుకను రూ.2వేల నుంచి రూ.3వేల వరకు గ్రామాల్లో ఇందిరమ్మ లబ్ధిదారులకు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. ట్రాక్టర్ ఎవరైనా ఆపితే పోలీసులకు (police), రెవిన్యూ అధికారులకు మామూళ్లు ఇస్తున్నామని చెబుతున్నారు. ఇప్పటికైనా మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖలు మేలుకోకపోతే మండల వ్యాప్తంగా ఉన్న వాగులు గుల్ల అయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి ఇసుక మాఫియాను అరికట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు

