డివైడర్ను ఢీ కొట్టిన ఇన్నోవా

ఇంజన్లో మంటలు
పూర్తిగా దగ్ధమైన వాహనం
వాహనంలో ఇరుక్కుపోయిన వారిని కాపాడిన లారీ డ్రైవర్లు
సురక్షితంగా బయటపడిన ఎనిమిది మంది
చిట్యాల మండలం గుండ్రంపల్లి హైవే యూటర్న్ వద్ద ప్రమాదం
చిట్యాల, నవంబర్ 8 (ఆంధ్రప్రభ) : నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాoపల్లి వద్ద శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో ఇన్నోవా కారు పూర్తిగా దగ్ధమై కాలిపోయిన ఘటన చోటుచేసుకుంది. ఈ కారులో ఎనిమిది మంది సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరిన ఇన్నోవా కారు తెల్లవారుజామున గుండ్రాంపల్లి వద్ద డివైడర్ను ఢీకొట్టి బోల్తా కొట్టి హైదరాబాద్ – విజయవాడ వైపు వెళ్లే రోడ్డుపై పడటంతో ఇంజన్లో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఇన్నోవాలో ఎనిమిది మంది ఉన్నారు.

హైవేపై వస్తున్న లారీలు పక్కన ఆపి రామకృష్ణ, అశోక్, షరీఫ్లు ఇన్నోవా కార్ డోర్లు తెరిచి అందులో ఉన్నవారిని బయట తీసి కాపాడారు. ఇందులో ఒకరు అయ్యప్ప మాల ధరించి ఉన్నారు. ఇన్నోవాలో ఉన్నవారిని కాపాడే ప్రయత్నంలో వారికి మంటలు అంటుకొని గాయపడ్డారు. వీరిని చౌటుప్పల్ హాస్పిటల్ నుండి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలు లెక్కచేయకుండా తోటివారిని కాపాడినందుకు పలువురు వీరిని ప్రశంసించారు.

