హైదరాబాద్: పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆసుపత్రి ఐదవ అంతస్తులోని అత్యవసర విభాగంలో మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో అత్యవసర విభాగంతో పాటు ఇతర బ్లాకులలో రోగులు, వారి సహాయకులు భయాందోళనకు గురయ్యారు.
అయితే, మంటలు చెలరేగిన ఐదవ అంతస్తులో రోగులు ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. పోలీసులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. లిఫ్ట్ పక్కన ఉన్న ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయని ప్రాథమికంగా నిర్ధారించారు.