ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన

కాశీ విశ్వేశ్వరాల‌యంలో ఎమ్మెల్యే యార్లగడ్డ పూజ‌లు

విజయవాడ రూరల్‌, ఆంధ్రప్రభ : విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో వెలసిన ప్రాచీన, చారిత్రక ప్రాధాన్యత కలిగిన శ్రీశ్రీశ్రీ కాశీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు బుధవారం వైభవంగా శంకుస్థాపన జరిగింది. శ్రీ పరాభవ నామ సంవత్సర వైశాఖ శుద్ధ త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని, హస్త నక్షత్రయుక్త వృషభ లగ్న పుష్కరాంశ ముహూర్తంలో పునాది రాయి వేశారు. ఈ కార్యక్రమం శ్రీమన్ మునీంద్ర మహారాజ్ సారధ్యంలో, డాక్టర్ మామిళ్లపల్లి ఫణికుమార్ పర్యవేక్షణలో శైవ ఆగమ నియమాల ప్రకారం నిర్వహించబడింది.

ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ కు వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. గణపతి పూజ, పుణ్యాహవాచనం, వాస్తు హోమం వంటి పూజా కార్యక్రమాలు వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ, చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ ఆలయాన్ని పునర్నిర్మించడం ఎంతో సంతోషకరమని తెలిపారు.

ఆలయాన్ని ఆగమశాస్త్రం ప్రకారం శిల్పకళా సౌందర్యంతో అభివృద్ధి చేసి, భక్తులకు అన్ని వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నున్న గ్రామ టిడిపి అధ్యక్షులు కలతోటి శ్రీనివాసరెడ్డి, గంపా శ్రీనివాస్, యార్కారెడ్డి కోటిరెడ్డి, పామర్తి శ్రీనివాసరావు, బాలశేఖర రెడ్డి, పోలారెడ్డి సాంబిరెడ్డి, బొకినాల తిరుపతిరావు, గోవింద నాగబాబు, ఆలయ కమిటీ సభ్యులు, దాతలు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

Leave a Reply