తిరుమల : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనాన్ని టీటీడీ కల్పించనుంది. ఈ విధానం ఈనెల 24నుండి అమల్లోకి రానుంది. ఇందులో భాగంగా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి తెలంగాణ ప్రజా ప్రతినిధుల నుండి సిఫార్సు లేఖలను ఆది, సోమవారాల్లో మాత్రమే స్వీకరించడం జరుగుతుంది.
(సోమ, మంగళవారం దర్శనాలకు గాను) అదేవిధంగా రూ.300 దర్శనం టికెట్లకు సంబంధించి సిఫార్సు లేఖలను బుధ, గురువారాల్లో మాత్రమే స్వీకరించడం జరుగుతుందని (ఏ రోజు కా రోజు దర్శనం) తెలియజేయడమైనది. (ఒకరికి ఒక సిఫార్సు లేఖను మాత్రమే 6 మందికి మించకుండా స్వీకరించడం జరుగుతుంది).
ఇప్పటి వరకు సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనానికి గాను ఆదివారం ఆంధ్ర ప్రజాప్రతినిధుల నుండి స్వీకరిస్తున్న సిఫార్సు లేఖలు ఇకపై శనివారం (ఆదివారం దర్శనం కోసం) స్వీకరించబడతాయి. తిరుమలలో అందుబాటులో ఉన్న వసతి సౌకర్యాలను, ఇతర భక్తుల దర్శన సమయాలను దృష్టిలో ఉంచుకుని సుదీర్ఘంగా చర్చించిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం టీటీడీ ఈ మేరకు నిర్ణయించింది. ఈ మార్పులను భక్తులు దృష్టిలో ఉంచుకొని టీటీడీకి సహకరించవలసిందిగా కోరారు.