హైదరాబాద్ – గత ప్రభుత్వం తీసుకొచ్చిన కళ్యాణ లక్ష్మి పథకాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. కళ్యాణ లక్ష్మి పేరు మార్చి కళ్యాణ మస్తు గా మార్చాలని అనుకున్నాం.. అది భవిష్యత్ లో అమలు చేస్తామని అన్నారు. తెలంగాణ శాసన సభ సమావేశాలు మూడో రోజైన నేడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అడిగిన ప్రశ్నకు మంత్రి పొన్నం ఇస్తూ, ప్రభుత్వం మహిళలకు గత 10 సంవత్సరాల కంటే మెరుగైన పథకాలు తీసుకొస్తుందని తెలిపారు.
బలహీన వర్గాలకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. కళ్యాణలక్ష్మి , షాది ముబారక్ ల పేరు మార్చలేదన్నారు. గత ప్రభుత్వం రెండు, మూడు సంవత్సరాలుగా పెట్టిన కళ్యాణ లక్ష్మి బకాయిలు తాము విడుదల చేశామని పొన్నం అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల నిధులకు కళ్యాణ లక్ష్మి నిధులకు సంబంధించి ఎక్కడ ఇబ్బంది లేదు అని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో వివాహాలు చేసుకునే వారికి ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తున్నామని స్పష్టం చేశారు.
పెళై పిల్లలు పుట్టాకే ఇచ్చారు…
గతంలో పెళ్లై పిల్లలు పుట్టిన తరువాత చెక్కులు తీసుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు బకాయిలు లేకుండా చూసుకుంటున్నం.. వెంటనే చెల్లిస్తున్నామని పొన్నం తెలిపారు. కళ్యాణ లక్ష్మి పెండింగ్ బకాయిలపై ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. బాల్య వివాహాలు నివారించాలని మేము కూడా ముందుకు పోతున్నాం కళ్యాణ లక్ష్మి బరా బర్ కొనసాగిస్తున్నామని పొన్నం ప్రభాకర్ తెలిపారు.
తులం బంగారం ఎక్కడ …. కవిత

పేదింటి ఆడబిడ్డల వివాహానికి కల్యాణమస్తు స్కీం కింద తులం బంగారం ఇస్తామన్న హామీని రేవంత్ రెడ్డి సర్కార్ నిలుపుకోలేకపోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. శాసన మండలి ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఆమె మాట్లాడుతే, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మ్యానిఫెస్టో ఖురాన్, బైబిల్, భగవద్గీతతో సమానం అని రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పారన్నారు.. . అది అబద్ధమని శాసనమండలి సాక్షిగా బయటపడిందన్నారు. కల్యాణమస్తు పథకం ద్వారా లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని అన్నారని అయితే. కల్యాణమస్తు పథకం గురించి మేం అడిగిన ప్రశ్నకు ఆ పథకాన్ని ప్రవేశపెట్టే ఆలోచన లేదని కౌన్సిల్ సాక్షిగామంత్రి పొన్నం సమాధానం చెప్పారన్నారు. ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడుతూన్నారు అని కవిత ధ్వజమెత్తారు. మహిళల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని కవిత మండిపడ్డారు.