వెలగపూడి – ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై వాస్తవాలను వినే పరిస్థితిలో వైసీపీ లేదని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ దుయ్యబట్టారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ద్వారా పేద విద్యార్థులకు ఆర్థికసాయంపై మండలిలో వైసీపీ సభ్యుల ప్రశ్నలకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి సమాధానం ఇస్తున్నసమయంలో నారా లోకేష్ కలుగజేసుకుని ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల విషయంలో వైసీపీ అవాస్తవాలు ప్రచారం చేస్తుందంటూ వైసీపీ సభ్యుల ఆరోపణలు తిప్పికొట్టారు.
ప్రశ్నలు అడుగుతారు… బాయ్ కాట్ చేస్తారు..
మంత్రి మాట్లాడుతూ.. విద్యారంగంపై శాసనమండలిలో చర్చ జరిగితే వైసీపీ సభ్యులు ఎందుకు బయటకు వెళ్లారు? ఈ విషయాలన్నీ ఆ రోజు చెప్పాం. మీరెందుకు బాయ్ కాట్ చేశారు? ఆ రోజు జరిగిన చర్చలో ఫీజు రీయింబర్స్ మెంట్ పై చాలా స్పష్టంగా చెప్పాం. వినకుండా, చదవకుండా మళ్లీ ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నోట్ పంపిస్తాను, ఒకసారి చదవాలి. మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి వాస్తవాలు చెబుతుంటే దానిని కూడా ఓర్చుకోలేక పోతున్నారు. వైసీపీ హయాంలో రూ. 4,200 కోట్లు బకాయిలు పెట్టారు. అవునో, కాదో చెప్పాలి.
వివరాలు పంపిస్తాం.
స్కూల్ ఫీజు రీయింబర్స్ మెంట్, పీజీ ఫీజు రీయింబర్స్ మెంట్ వివరాలన్నీ అందులో ఉన్నాయి. 2019లో ఆనాటి ప్రభుత్వం పెట్టిన బకాయిలను 16 నెలల తర్వాత వైసీపీ ప్రభుత్వం చెల్లించింది. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలే అయింది. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు కచ్చితంగా చెల్లిస్తాం. హౌస్ సాక్షిగా హామీ ఇచ్చాను. చర్చలో వైసీపీ సభ్యులు లేకపోతే నేనేం చేయగలను అని అన్నారు.
వసతి దీవెనకు వైసిపి ప్రభుత్వం మంగళం ..
బీఏసీలో విద్యారంగంపై చర్చ కావాలని అడిగితే ఒప్పుకున్నామని మంత్తి వీరాంజనేయులు అన్నారు.. కానీ ఆ చర్చకు వైసీపీనే లేదు. వాస్తవాలు వినడానికి సిద్ధంగా లేరని మంత్రి విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన వివరాలు పూర్తిగా చదవాలని సూచించారు. విద్యార్థుల జీవితాలతో వైసీపీ ప్రభుత్వం చెలగాటమాడిందని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి ధ్వజమెత్తారు. వసతి దీవెన ఏనాడు సక్రమంగా చెల్లించలేదని ఆయన మండిపడ్డారు.
పోలవరం నిర్వాశితులు ఇటుక సాయం చేయని జగన్ ….
గత ప్రభుత్వ అధికారంలో ఉన్న అయిదేళ్ల కాలంలో పోలవరం నిర్వాశితుల కోసం నిర్మించే కాలనీలకు కనీసం ఒక్క ఇటుక సాయం చేయలేదని అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. పోలవరం కోసం 2014 నుంచి ఇప్పటివరకు రూ.19,396 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. “పోలవరం కోసం కేంద్రం రూ.17,860 కోట్లు చెల్లించింది. ప్రాజెక్టు వల్ల 96,660 కుటుంబాలు ముంపునకు గురవుతున్నాయి. నిర్వాసితులకు తొలి దశలో రూ.1,203 కోట్లు అందించాం. ఇంకా 18,266 కుటుంబాలకు రూ.1340 కోట్లు చెల్లించాలి. ఇప్పటివరకు 12,797 నిర్వాసితుల కుటుంబాలను తరలించాం. ఇంకా 27,263 కుటుంబాలను తరలించాలి. 75 నిర్వాసితుల కాలనీల్లో 49 నిర్మాణంలో ఉన్నాయి. ఆగస్టు లోపు భూసేకరణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. తొలి దశ అర్ అండ్ ప్యాకేజ్ 2026 జూన్ లోపు పూర్తి చేస్తాం. పోలవరం ఎత్తును జగన్ హయాంలోనే రెండుగా విభజించారు. పోలవరానికి 41.15 మీటర్ల ఎత్తు ప్రతిపాదన పెట్టింది వైసిపి ప్రభుత్వమే. పోలవరం ఎత్తు ఎందుకు తగ్గించారో జగన్నే అడగాలి. నిర్వాసితుల కాలనీల్లో ఒక్క ఇంటికీ ఆయన హయాంలో పునాది వేయలేదు” అని నిమ్మల రామానాయుడు అన్నారు