బెంగళూరు : టెక్నాలజీని బాధ్యతాయుతంగా వాడుకోకుంటే భారీ విధ్వంసం జరిగే అవకాశం ఉంటుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ . డ్రోన్ టెక్నాలజీని వ్యవసాయానికి, యుద్ధానికి వాడుకోవచ్చని అన్నారు.. అయితే దానిని నిర్ణయించుకోవాల్సింది మనమే అని పేర్కొన్నారు. అందరికీ సాంకేతిక అక్షరాస్యత (డిజిటల్ లిటరసీ) లేకుంటే అందరికీ సమాన అవకాశాలు అందించలేమని తెలిపారు. దేశంలో సైబర్ నేరాలు, ఆన్లైన్ జూదం ఘోరాలు భారీగా పెరుగుతున్నాయని తెలిపారు. కేవలం కాలర్ ట్యూన్ పెట్టి వీటిని అరికట్టలేం అని కేటీఆర్ స్పష్టం చేశారు.
బెంగళూరులో నేడు జరిగిన ఎంట్రప్రెన్యూర్ టెక్ అండ్ ఇన్నోవేషన్ సమిట్లో ఆయన ప్రసంగిస్తూ, టెక్నాలజీ ప్రపంచాన్ని మలచడంలో ఉన్న అవకాశాలను వినియోగించుకునే విధంగా నూతన ఆవిష్కరణలు సాగాలని అన్నారు. సాంకేతికత అభివృద్ధి కావాలని అదే సమయంలో అది సమాజానికి మేలు చేయాలని అభిప్రాయపడ్డారు . సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, కానీ ప్రతి సాంకేతిక ఆవిష్కరణ వెనుక మానవ అవసరాలు, నైతిక విలువలు నిలకడగా ఉండాలని సూచించారు. ఆర్టిఫిషీయల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI), క్వాంటమ్ కంప్యూటింగ్, ఎక్స్టెండెడ్ రియాలిటీ (XR), ఇంటర్నెట్ ఆఫ్ బాడీస్ (IoB) వంటి సాంకేతిక పరిణామాలు ప్రపంచాన్ని మార్చగలవని కేటీఆర్ తెలిపారు.
రేడియోలు మాయమై, టీవీలు వచ్చాయి, ఇప్పుడు పాడ్కాస్టుల హవా. ఫార్మాట్ మారుతుండొచ్చు, కానీ మానవ అవసరాలు ఎప్పటికీ మారవు. సాంకేతికతను బాధ్యతగా ఉపయోగించకపోతే అది ప్రమాదకరమవుతుంది. భవిష్యత్తు నిర్మాణం అంటే కేవలం రేపటి రోజుల్లో జీవించడం కాదు రేపటిని నిర్మించడం అని కెటిఆర్ చెప్పారు. ఇదే స్ఫూర్తితో సామాజిక ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని టెక్నాలజీ అభివృద్ధి జరగాలన్నారు. డ్రోన్స్ వ్యవసాయాన్ని సమర్థవంతంగా మార్చగలవనే సందేశాన్ని ఆయన వినిపించారు. అదే డ్రోన్స్ విధ్వంసానికి ఉపయోగిస్తే అది ప్రమాదకరం. అందుకే ప్రతి టెక్నాలజీ రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది అని కేటీఆర్ పేర్కొన్నారు.
ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం మానవ జీవితంతో పెనువేసుకుంటున్న కొద్దీ.. సాంకేతిక ప్రగతి పెరుగుతున్న కొద్దీ.. సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయన్నారు. టెక్నాలజీ సామర్థ్యం అధికంగా ఉన్న యువత సైబర్ నేరాలకు ఎందుకు పాల్పడుతున్నారో ఆలోచించాలని కెటిఆర్ కోరారు. సైబర్ నేరాలపైన కేవలం ఒక కాలర్ ట్యూన్ పెట్టి ఆపలేమని స్పష్టం చేశారు. అంతేకాక, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ వలన జరుగుతున్న దుష్పరిణామాలను ఆపడం ప్రభుత్వాలు నడిపే వారికి పెద్ద సవాలుగా మారిందని అన్నారు.
సాంకేతిక అభివృద్ధిలో పర్యావరణ పరిరక్షణ అంశాన్ని అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి రోజూ భారీ డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. వాటి విద్యుత్, వాటర్ వినియోగంపై ఎవరూ దృష్టి పెట్టడం లేదు. అంతేకాక, టెక్నాలజీ వల్ల పర్యావరణంపై కలిగే ప్రభావం గురించి తగిన అధ్యయనం లేకుండా ముందుకు వెళితే భవిష్యత్తు ఇబ్బందికరంగా మారుతుంది. ఐఓటీ, మోబైల్ యాప్లు, డేటా స్టోరేజ్ ఇవన్నీ పెరుగుతున్నాయి. కానీ, అవి ఎంతగా పర్యావరణ భంగాన్ని కలిగిస్తున్నాయో ఆలోచించాలి. ప్రస్తుతం తమ మాతృభాషల పట్ల జరుగుతున్న వివక్ష గురించి మాత్రమే కాకుండా టెక్నాలజీ తెలిసినవారు టెక్నాలజీ తెలవని వారు అని సమాజంలో ఏర్పడుతున్న సరికొత్త విభజనపైన దృష్టి సారించాలి. టెక్నాలజీ నిరక్షరాస్యత ఉన్న జనాభాకి ఏ విధంగా సహాయం చేయాలో ఆలోచించాలి. డిజిటల్ విభజన పెరుగుతున్నకొద్దీ సమాజంలో మరింత విభజన వస్తుంది.. టెక్నాలజీ అందరికీ సమానంగా అందినప్పుడే సమాన అవకాశాలు ఏర్పడతాయని కేటీఆర్ తెలిపారు.