పోషక ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

మునుగోడు, ఆంధ్రప్రభ : పోషకాహారం తీసుకుంటేనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని సర్పంచ్ అద్దంకి రామలింగయ్య తెలిపారు. ఈ రోజు నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని కోరటికల్ గ్రామంలో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అద్దంకి రామలింగయ్య మాట్లాడుతూ.. చిన్నారుల్లో పోషకాహార లోపం రాకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవాలని,జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలని అవగాహన కల్పించారు.ప్రోటీన్లు, విటమిన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.
గర్భిణీ స్త్రీలు పోషకాహారం తీసుకుంటే పుట్టబోయే శిశువులు ఆరోగ్యంగా పుడతారని ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎం.నాగమణి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మందుల అంజయ్య,పంచాయతీ కార్యదర్శి ఎస్.శ్రీనివాస్, వైద్యాధికారి అయేషా,అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
