National Awards to AP | గ్రామీణాభివృద్ధిలో ఏపీ దూకుడు..
National Awards to AP | గ్రామీణాభివృద్ధిలో ఏపీ దూకుడు..
- ఐదు అవార్డులతో పంచాయతీరాజ్ శాఖ సత్తా!
- వరుసగా రెండో ఏడాది పంచాయతీరాజ్ అవార్డుల పంట!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ వరుసగా రెండో ఏడాదీ జాతీయ స్థాయి పురస్కారాలు అందుకోవడం పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారాలు కైవసం చేసుకొనే ప్రక్రియలో భాగస్వాములైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది, సర్పంచులు, వార్డు సభ్యులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.
న్యూఢిల్లీలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రం తరఫున అవార్డులు స్వీకరించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండేకి, కమిషనర్ కృష్ణ తేజకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పురస్కారాలు రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థల పనితీరు, ప్రజాప్రతినిధుల నిబద్ధత, అధికారుల సమష్టి కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. అవార్డులు అందించిన ప్రేరణతో మరింత ఉత్సాహంగా పని చేసి గ్రామీణాభివృద్ధి, సుపరిపాలన లక్ష్యాల సాధనకు కృషి చేయాలని సూచించారు.
ఈ ఏడాది రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో మొత్తం ఐదు అవార్డులు గెలుచుకోగా అందులో తిరుపతి జిల్లా బొక్కసంపాలెం మహిళలకు స్నేహపూర్వక వాతావరణం గల పంచాయతీల్లో ప్రథమ స్థానం దక్కించుకుంది. సుపరిపాలనలో విశాఖ జిల్లా శృంగవరం నంబర్ వన్ ర్యాంకు సాధించగా, పేదరిక నిర్మూలన, మెరుగైన జీవనోపాధి అంశాల్లో చెమ్మెళ్లపల్లి రెండో స్థానంలో నిలిచింది. స్వయం సమృద్ధి విభాగంలో గుండమల, అత్యుత్తమ మండలాల్లో కుప్పం 3వ స్థానంలో నిలిచిన విషయం విదితమే.
