TG | కొత్త ఫ్లైఓవర్ నిర్మాణాలపై సీఎం రేవంత్ సమీక్ష
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చేపడుతున్న పలు ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా నగరంలోని మీర్ ఆలం చెరువుపై నిర్మించే బ్రిడ్జిని అత్యంత ప్రముఖ ప్రాంతంగా తీర్చిదిద్దాలని, చిన్నపిల్లలను దృష్టిలో ఉంచుకుని బ్రిడ్జి చుట్టుపక్కల ప్రాంతాలను ఆకర్షణీయంగా మార్చాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
మీర్ ఆలం చెరువుపై 2.4 కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జి నిర్మాణం కోసం మూడు ప్రతిపాదనలను అధికారులు వివరించగా, ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. 90 రోజుల్లో డీపీఆర్ సిద్ధం చేయడంతో పాటు 30 నెలల్లోగా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్తగా నిర్మించ తలపెట్టిన ఫ్లైఓవర్లపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రోడ్ల విస్తరణ పనులను వేగవంతం చేయాలన్నారు. ఈ అంశాలపై రెండు రోజుల్లో సమగ్ర సమాచారంతో మరోసారి సమీక్షకు రావాలని చెప్పారు.
ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.