Chittoor | నింగి నుంచే నిఘా

Chittoor | నింగి నుంచే నిఘా

  • నగరి ఉపవిభాగ పోలీసులకు 7 కొత్త డ్రోన్లు

Chittoor | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు జిల్లా పోలీసు శాఖ ఆధునిక సాంకేతిక విధానాల వినియోగాన్ని మరింత విస్తరిస్తూ, ప్రజా భద్రతను పటిష్టం చేసే దిశగా మరో కీలక అడుగు వేసింది. నింగి నుంచే నిఘా నిర్వహించే విధంగా, నగరి ఉపవిభాగ పోలీసులకు ఏడు కొత్త డ్రోన్లను జిల్లా పోలీసు అధికారి తుషార్ డూడి సంస్థల సామాజిక బాధ్యత నిధుల ద్వారా అందించారు. ఈ డ్రోన్లను సోమవారం చిత్తూరులోని పోలీసు అతిథి గృహ సమావేశ మందిరంలో అధికారికంగా అప్పగించారు.

ఈ సందర్భంగా జిల్లా పోలీసు అధికారి మాట్లాడుతూ… నగర ఉపవిభాగ పరిధిలోని సరిహద్దు ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, రద్దీ ప్రదేశాలు, నేరాలకు అవకాశం ఉన్న ప్రాంతాలు, అక్రమ రవాణా మార్గాలు, ప్రజా కార్యక్రమాలు, ఉత్సవాలు, సమావేశాల వంటి సందర్భాల్లో డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా నిర్వహించి ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయాలని సూచించారు.

Chittoor

డ్రోన్ల వినియోగంతో చట్ట అమలు చర్యల్లో వేగం పెరుగుతుందని, అనుమానాస్పద కార్యకలాపాలు, అక్రమ రవాణా వంటి వాటిని త్వరగా గుర్తించవచ్చని తెలిపారు. ఉత్సవాలు, సభలు, క్రీడా కార్యక్రమాల్లో జనసమూహ కదలికలను పై నుంచి పర్యవేక్షించి ప్రమాదాలను నివారించవచ్చని, వాహన రాకపోకలపై నిఘా ద్వారా రద్దీ ప్రాంతాల్లో పరిస్థితిని అంచనా వేసి వెంటనే చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు.

బందోబస్తు సమయంలో నింగి నుంచే పరిస్థితులను గమనిస్తూ బలగాల సమన్వయాన్ని మెరుగుపరచడం సాధ్యమవుతుందని, నేరాల నియంత్రణకు అవసరమైన దృశ్య ఆధారాలను సేకరించడంలో డ్రోన్లు ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో తక్షణ పర్యవేక్షణ సాధ్యమవుతుందని, అక్రమ మద్యం, గంజాయి, ఇసుక రవాణా వంటి అక్రమ కార్యకలాపాలను గుర్తించి అరికట్టడంలో, అటవీ మరియు సరిహద్దు ప్రాంతాల్లో అనుమానాస్పద కదలికలను పర్యవేక్షించడంలో డ్రోన్లు ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయని జిల్లా పోలీసు అధికారి వివరించారు. ప్రజల భద్రతే లక్ష్యంగా సాంకేతిక ఆధారిత పోలీసు వ్యవస్థ వైపు చిత్తూరు జిల్లా పోలీసు శాఖ ముందడుగు వేస్తోందని, డ్రోన్ల వినియోగంతో నేర నిరోధక చర్యలు మరింత సమర్థవంతంగా అమలవుతాయని తుషార్ డూడి స్పష్టం చేశారు.

Leave a Reply