భూదాన్‌ బాధితుల ఇంటి నిర్మాణాలకు మార్గం సుగుమం

భూదాన్‌ బాధితుల ఇంటి నిర్మాణాలకు మార్గం సుగుమం

ప్రభుత్వం తరుపున వాదించిన న్యాయవాది మురళిధర్ రెడ్డి
కోర్టును ఆశ్రయించిన కొందరికి చుక్కెదురు
స్టేటస్‌ కో నిరాకరించన న్యాయస్థానం.
వెలుగుమట్ల కాలనీ పనులు షురూ
ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు చెల్లుబాటు
భూదాన్‌ భూముల్లో మిగిలిన బాధితులకు పట్టాలిచ్చేందుకు లైన్‌క్లియర్‌
మిగిలిన బాధితులకు పట్టాలించేందుకు కొనసాగుతున్న ప్రక్రియ

ఖమ్మం, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యాప్తంగా భూదాన్‌ భూముల అంశం సంచలనంగా మారింది. ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల ప్రాంతంలో గల భూదాన్‌ భూములలో గుడిసెల తొలగింపు ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం విధితమే. గత కొన్ని నెలలుగా భూదాన్‌ భూముల వ్యవహారంలో తీవ్ర ఉత్కంఠ వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. భూదాన్‌ భూములలో గుడిసెలు తొలగించిన అంశంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందని విమర్శలు వచ్చిన నేపథ్యంలో బాధితులకు తిరిగి వెలుగుమట్ల భూదాన్‌ భూములలోనే జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం వాస్తవ బాధితులను గుర్తించి గత కొన్ని రోజుల క్రితం 311 పట్టాలు ఇచ్చి బాధితులకు న్యాయం చేసింది.

భూదాన్‌ భూముల అంశం గుడిసెల తొలగింపులో నష్టపోయిన ఇతర ప్రాంతాలకు చెందిన 111 మంది బాధితులకు సైతం వారి స్వగ్రామాలలో వారికి నష్టం చేయకుండా ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడి వారు ఉన్న చొటనే ప్రభుత్వ స్థలం కేటాయించి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి పట్టాలు సైతం జారీ చేసింది. ఈ నేపథ్యంలో కొందరు భూదాన్‌ భూముల పట్టాల కేటాయింపు అంశంలో గత కొన్ని రోజుల క్రితం కోర్టును ఆశ్రయించారు. కోర్టులో బుధవారం వారి వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరుపు న్యాయవాదిగా మురళీధర్‌రెడ్డి వ్యవహరించి కోర్టును ఆశ్రయించిన వారిలో కొందరికి అదే భూదాన్‌ భూములు వెలుగుమట్లలో పట్టాలు మంజూరయ్యాయని పేర్కొన్నారు.

కోర్టును ఆశ్రయించిన వారు ప్రస్తుతం ప్రక్రియను నిలుపుదల చేయాలని భూదాన్‌ భూముల అంశంపై కోర్టులో స్టేటస్‌ కో ఇవ్వాలని కోరినట్లు సమాచారం. వారు కోరిన విధంగా స్టేటస్‌ కో ఇస్తే వందల మంది పేదలకు అన్యాయం చేసినట్లు ఉంటుందని ఇంకా మరికొందరు వాస్తవ లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చే ప్రక్రియ సైతం నిలుపుదల చేయటం ఎంత వరకు సమంజసమని ప్రభుత్వ న్యాయవాది మురళీధర్‌రెడ్డి వాదనలు వినిపించారని పర్కొన్నారు. దీంతో కోర్టు స్టేటస్‌ కో ఇవ్వడానికి నిరాకరించినట్లు, భూదాన్‌ బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ఇచ్చిన మాట ఖచ్చితంగా నిలబెట్టుకునే క్రమంలో ఇచ్చిన పట్టాలు చెల్లుబాటులో ఉంటాయని ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాలు, వెలుగుమట్ల కాలనీ పనులు యధావిధంగా కొనసాగుతాయని జిల్లా అధికార యంత్రాంగం పేర్కొంది.

మిగిలిన బాధితులకు పట్టాలు ఇచ్చే ప్రక్రియ సైతం కొనసాగుతుందని నష్టపోయిన వాస్తవ బాధితులకు ఎవరికీ అన్యాయం జరుగకుండా ఖచ్చితంగా నిరాశ్రయులైనబాధితులకు ఆశ్రయం కల్పించే దిశగా జిల్లా అధికార యంత్రాంగం పని చేస్తుందని, రెవెన్యూశాఖ తిరిగి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగిస్తుందని వెలుగుమట్ల కాలనీలో యధావిధిగా మిగతా పనులు కొనసాగనున్నట్లు రెవెన్యూ యంత్రాంగం పేర్కొంటుంది. ఏ బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని త్వరలోనే మిగతా వారికి సైతం పట్టాల పంపిణీ కార్యక్రమం యదావిధిగా ఉంటుందని ఇప్పటికే వాస్తవ లబ్ధిదారుల వివరాల సేకరణ, దరఖాస్తుల పరిశీలన, బాధితుల ఎంక్వయిరీ పలు అంశాల ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు రెవెన్యూ అధికారులు పలువురు పేర్కొంటున్నారు.

భూదాన్‌ భూములపై సందిగ్ధత వీడినట్లేనా.. కోర్టును ఆశ్రయించిన కొందరికి చుక్కెదురు అయినట్లు స్టేటస్‌ కో నిరాకరణ వల్లభూదాన్‌ భూముల అంశంలో చిక్కుముడులు వీడినట్లు పరిస్థితులు మారాయని పలువురు ప్రజాసంఘాలు పేర్కొంటున్నారు. ప్రభుత్వం జిల్లా మంత్రులు ఇచ్చిన మాట నిలబెట్టుకునేవిధంగా చర్యలు జరుగుతున్నాయని పట్టాలు పొందిన పలువురు బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.తిరిగి వెలుగుమట్లలో నూతనంగా ఇచ్చిన పట్టాలు ఇంటి నిర్మాణాలకుసుగమం అయినట్లు అక్కడ పనులు యదావిధిగా కొనసాగించనున్నట్లు సంబంధిత శాఖల అధికారులు పేర్కొంటున్నారు.

Leave a Reply