Bheemgal | నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు..
- రైతులకు నాణ్యమైన విత్తనాలే విక్రయించాలి: అధికారులు
భీమ్గల్ టౌన్, ఆంధ్రప్రభ: రైతులకు నాణ్యమైన విత్తనాలను మాత్రమే విక్రయించాలని, నకిలీ విత్తనాల విక్రయానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ కిరణ్ కుమార్, ఇన్చార్జి వ్యవసాయ శాఖ అధికారి లావణ్య హెచ్చరించారు. గురువారం భీమ్గల్ పట్టణంలోని పలు విత్తన విక్రయ కేంద్రాలను వారు తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, విత్తన డీలర్లు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రైతులు కూడా లైసెన్సు కలిగిన విత్తన విక్రయ కేంద్రాల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని, కొనుగోలు సమయంలో తప్పనిసరిగా రశీదులు తీసుకోవాలని సూచించారు.
వ్యవసాయ శాఖ అధికారి లావణ్య మాట్లాడుతూ, ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని తెలిపారు. అలాగే యూరియా బుకింగ్ కోసం ఉదయం 6 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు నమోదు చేసుకోవచ్చని వివరించారు. ఈ తనిఖీల్లో ఆర్ఐ మల్లేష్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
