శ్రీశైల మల్లికార్జునుడి ‘స్పర్శదర్శనం’ ఇక మరింత సులువు

శ్రీశైల మల్లికార్జునుడి ‘స్పర్శదర్శనం’ ఇక మరింత సులువు

  • వాట్సప్ ‘మనమిత్ర’ ద్వారా టికెట్ల జారీ!

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ:

జ్యోతిర్లింగాలలో ఒకటైన నంద్యాల జిల్లాలో వెలసిన శ్రీశైలంలోని భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో శ్రీస్వామివారి స్పర్శదర్శనం టికెట్లు మనమిత్ర వాట్సప్ ద్వారా పొందే అవకాశం కల్పించామని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. భక్తులకు నకిలీ వెబ్సైట్లో బెడదని తగ్గించేందుకు కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. స్వామి అమ్మ వార్ల దర్శనాలతో పాటు మొత్తం 18 రకాల సేవా టికెట్లను మనమిత్ర వాట్సప్ ద్వారా పొందేఅవకాశం ఉందన్నారు. అదేవిధంగా విరాళాలు కూడా ఈ మనమిత్ర వాట్సప్ ద్వారా చెల్లించే వీలు కల్పించబడిందన్నారు. భక్తులకు మనమిత్రపై అవగాహన కల్పించేందుకు క్షేత్రపరిధిలో విస్తృతంగా మనమిత్ర బోర్డులను ఏర్పాటు చేయబడటం జరిగిందన్నారు.

అదేవిధంగా క్యూ కాంప్లెక్సు ఎదురుగా మనమిత్ర సహాయ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశామన్నారు. ఇంకా సి.ఆర్.ఓ కార్యాలయం, గణేశసదన్ మొదలైనచోట్ల కూడా మనమిత్ర సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగు తోందన్నారు. అలాగే పరోక్ష సేవా టికెట్లను కూడా మనమిత్ర ద్వారా పొందవచ్చునని తెలిపారు. శ్రీశైలానికి స్వయంగా విచ్చేయలేని భక్తులు వారి గోత్రనామాలతో ఆయా సేవలను పరోక్షంగా జరిపించుకునే వీలుగా దేవస్థానం ఈ పరోక్షసేవలను నిర్వహించడం జరుగుతోందన్నారు.

ఆయా పౌరసేవలను సమర్థవంతంగా, వేగంగా, పారదర్శకంగా అందించేందుకు వీలుగా వచ్చిన ఈ వాట్సాప్ గవర్నెన్స్ విధానంలో పౌరులు పలు శాఖలకు సంబంధించిన ఆయా సేవలను పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. ఆయా సేవలను సులభతరంగా అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్‌ నెంబరును 9552300009 అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు.

కాగా ఈ మనమిత్ర వాట్సాప్ ద్వారా దేవదాయశాఖ పరిధిలోని పలు ఆలయాల దర్శనం టికెట్లు, ఆర్జితసేవాటికెట్లు, ప్రసాదాల టికెట్లు , విరాళాలను చెల్లించే విధానాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఈ వాట్సాప్ ద్వారా శ్రీశైలదేవస్థానం నందలి శ్రీస్వామివారి స్పర్శదర్శనం, శీఘ్రదర్శనం, అతిశీఘ్రదర్శనం టికెట్లను పొందవచ్చునని తెలియజేశారు. అదేవిధంగా శ్రీస్వామివారి ఆర్జిత గర్భాలయఅభిషేకం, ఆర్జితసామూహిక అభిషేకం, కుంకుమార్చన, గణపతిహోమం, రుద్రహోమం, మహామృత్యుంజయహోమం, చండీహోమం, కల్యాణోత్సవం, అన్నప్రాశన, అక్షరాభ్యాసం మొదలైన 18 ఆర్జితసేవలకు సంబంధించిన సేవా టికెట్లను కూడా పొందవచ్చునని పేర్కొన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్యనిర్వహణాధికారి కోరారు.

Leave a Reply