ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ రహదారి 44పై చందా టీ బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున 4.20 గంటల సమయంలో రెండు వాహనాలు ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్ర వైపు వెళ్తున్న ఒక వ్యాన్ టైర్ ప్రమాదవశాత్తు పేలిపోయింది. అనంతరం ఆ వాహనం డివైడర్ను ఢీకొట్టింది.దీంతో ఆ వాహనం ఇండికేషన్ లైట్లు కూడా ఆగిపోయాయి. ఇదే సమయంలో హైదరాబాద్ నుంచి జబల్పూర్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు.. వేగంగా దూసుకొచ్చి వ్యాన్ను ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్తో పాటు అందులోనే ఉన్న అదనపు డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయారు.
మరో 10 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. చాలా వరకు అందరు స్వల్ప గాయాలతో బయటపడినట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.